తెలంగాణ రాష్ట్రంలో మార్చ్ 6వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశ పెట్టాల్సిన బడ్జెట్ ప్రతిపాదనలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు మార్చ్ 4, బుధవారం నాడు ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు. పలు బడ్జెట్ ప్రతిపాదనలకు తుది మెరుగులు దిద్దారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు ప్రధాన పథకాలకు కేటాయింపులతో పాటుగా ఎన్నికల హామీల అమలు నిమిత్తం చేస్తున్న కేటాయింపులను ఈ సందర్భంగా అధికారులకు సీఎం కేసీఆర్ వివరించినట్టుగా తెలుస్తుంది. ఈ సమీక్ష కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్ రావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి స్మితా సభర్వాల్, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
[subscribe]