ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ ఆసాంతం అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వస్తున్నా భారత్ జట్టు ప్రపంచకప్ లో తొలిసారిగా ఫైనల్ కు చేరుకుంది. కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ నేతృత్వంలో బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాల్లో భారత్ మహిళల జట్టు ప్రత్యర్థి జట్లపై పూర్తి ఆధిపత్యాన్ని చూపిస్తూ దూసుకెళ్తుంది. భారత్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్ కు చేరుకున్నాయి. మార్చ్ 5, గురువారం నాడు సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరగాల్సిన తొలి సెమీఫైనల్ మ్యాచ్ వర్షం కారణంగా ఒక్క బాల్ కూడా పడకుండానే రద్దు అయ్యింది. దీంతో నాలుగు విజయాలతో గ్రూప్ ఏలో అగ్రస్థానం సాధించి, మెరుగైన రన్రేట్ ఉండడంతో భారత్ జట్టు నేరుగా ఫైనల్ కు చేరుకుంది.
కాగా గత టీ20 ప్రపంచకప్లో భారత్ జట్టు సెమీఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించిన సంగతి తెలిసిందే. మరోవైపు రెండో సెమీఫైనల్లో భాగంగా ఆస్ట్రేలియా X దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరగాల్సిన మ్యాచ్ పై కూడా వర్షం ప్రభావం చూపించే అవకాశం ఉంది. వర్షం వలన ఈ మ్యాచ్ కూడా రద్దయితే భారత్, దక్షిణాఫ్రికా జట్లు మార్చ్ 8, ఆదివారం నాడు మెల్బోర్న్లో జరిగే ఫైనల్లో తలపడే అవకాశం ఉంది.