పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు ప్రధానబ్యాంకులుగా మారుస్తూ గతంలోనే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. పది బ్యాంక్లను నాలుగు బ్యాంక్లుగా కుదించిన విలీన ప్రక్రియ ఏప్రిల్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మార్చ్ 4, బుధవారం నాడు ప్రకటించారు. దేశీ బ్యాంకింగ్ వ్యవస్థలో భారీ సంస్కరణల దిశగా, ప్రభుత్వరంగ బ్యాంకులను అంతర్జాతీయస్థాయిలో నిలపడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె తెలిపారు. మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం నాడు బ్యాంకుల విలీన ప్రక్రియ వివరాలను మీడియాకు తెలిపారు. విలీన ప్రక్రియకు సంబంధించి చట్టపరమైన కార్యక్రమాలు అన్ని పూర్తయ్యాయని, విలీనం అనంతరం కార్యకలాపాలు సాగించేందుకు వారికి ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. వచ్చే ఏప్రిల్ 1 నుంచి ఆ మేరకు నాలుగు బ్యాంకుల్లో కార్యకలాపాలు మొదలవుతాయని ఆమె పేర్కొన్నారు.
గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకు విలీన ప్రక్రియలో భాగంగా దేనాబ్యాంకు, విజయాబ్యాంకులను బ్యాంక్ఆఫ్బరోడాలో విలీనం చేశారు. అలాగే భారతీయ మహిళా బ్యాంకుతోపాటు ఎస్బీఐ కు చెందిన ఐదు అనుబంధ బ్యాంకులను స్టేట్బ్యాంకు అఫ్ ఇండియాలో విలీనం చేశారు. 2017లో మొత్తం 27 ప్రభుత్వ రంగ బ్యాంకులుండగా గత సంవత్సరం బ్యాంకుల విలీనాలతో 18 కి చేరాయి. మళ్ళీ ఏప్రిల్ నుంచి 10బ్యాంకులు 4 బ్యాంకులుగా మారుతుండడంతో దేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్య 12 కు చేరనుంది.
బ్యాంకుల విలీనం వివరాలు
పంజాబ్నేషనల్ బ్యాంకుతో యునిటైడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ఆఫ్ కామర్స్ను విలీనం
కెనరాబ్యాంకుతో సిండికేట్ బ్యాంకు విలీనం
ఇండియన్బ్యాంకుతో అలహాబాద్ బ్యాంకు విలీనం
యూనియన్ బ్యాంక్ఆఫ్ ఇండియాలతో ఆంధ్రాబ్యాంకు, కార్పొరేషన్బ్యాంకు విలీనం