జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఏ) అమలుపై బీజేపీ ప్రభుత్వం చిత్తశుద్ధిని ప్రశ్నించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో 2023-24 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గించడంపై ఆమె మండిపడ్డారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లోని తన నివాసంలో ఉపాధి హామీ పథకం సంఘం ప్రతినిధులతో సమావేశమైన ఆమె నిధుల కోతపై మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యల గురించి సంఘం ప్రతినిధులు కవితకు వినతి పత్రం అందించారు. కాగా కవితను కలిసినవారిలో ఉపాధి హామీ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రవీణ్, ఉపాధి హామీ పథకం జేఏసీ చైర్మన్ లింగయ్య, కో చైర్మన్ వెంకట్ రామ్ రెడ్డి మరియు ఇతర ప్రతినిధులు ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్రం యత్నిస్తోందని, బీజేపీ ప్రభుత్వ విధానాలతో తీవ్రంగా నష్టపోయేది పేదలేనని తెలిపారు. దేశవ్యాప్తంగా ఉపాధి హామీ పథకం అమలుకు సుమారు రూ. 2.72 లక్షల కోట్ల నిధులు అవసరం ఉంటుందని, అయితే కేంద్ర బడ్జెట్లో కేవలం రూ. 60 వేల కోట్లు కేటాయించారని గుర్తుచేశారు. బీజేపీ సారధ్యంలోని ప్రభుత్వం ఈ పథకానికి క్రమేణా నిధులు తగ్గించడం దాని ఉద్దేశాన్ని తెలుపుతోందని, గడచిన ఐదేళ్ల బడ్జెట్లో ఈ ఏడాదే అతి తక్కువగా కేటాయింపులు చేశారని ఆరోపించారు. ఏ దేశం యొక్క బడ్జెట్ అయినా, ప్రభుత్వ ప్రాధాన్యతను సూచిస్తుందని, అయితే దురదృష్టవశాత్తూ మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో ఎంఎస్పీ, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం వంటి వాటికి ఎలాంటి ప్రస్తావన లేదని ఎమ్మెల్సీ కవిత మండిపడ్డారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE