బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు నిన్న గ్రేటర్ హైదరాబాద్ లోని పార్టీ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు సృష్టించినా.. కలిసికట్టుగా ఎదుర్కొందామని చెబుతూనే.. ఇతర పార్టీల వాళ్లు మభ్యపెడితే ఆశపడొద్దు అంటూ హితవు పలికారు. అంతేకాదు.. గతంలో ఎన్నడూ లేని రీతిలో బుజ్జగింపు ధోరణిలో మాట్లాడారు. మళ్లీ సిట్టింగ్ లకే సీట్లు కేటాయిస్తామని కూడా హామీ ఇచ్చారు. ఈలోపు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో సత్తాచాటాలని కోరారు. పక్క చూపులు చూడొద్దు అని చెప్పడం ద్వారా జంపింగ్లపై గులాబీ పార్టీలో గుబులు మొదలైందనే విషయం అర్థమవుతోంది. ఎమ్మెల్యే ల విషయంలోనూ బీఆర్ ఎస్ లో ఈ తరహా చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు జరిగిన ప్రచారాల్లో ఉత్సాహాలతో చిందులేసిన గులాబీ శ్రేణుల్లో ప్రస్తుతం నైరాశ్యం అలముకొంది. కార్యకర్తల నుంచి అగ్రస్థాయి నేతల దాకా ఇదే తీరు కనిపిస్తోంది.
గెలుపు ఓటములు ఎవరికైనా సహజమే. కానీ అధికారంలోకి వచ్చిన పార్టీ ఓటమి పాలైన పార్టీలోని గెలిచిన నేతలకు వలవేసే సంప్రదాయాన్ని రెండు దఫాలు అమలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు భయం పట్టుకుంది. తాము ఆచరించిన మార్గాన్నే ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అనుసరిస్తుందేమోననే ఆందోళన ఆనేతల్లో వ్యక్తమవుతోంది. పైకి ఎంత కాదంటున్నా.. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా .. లోలోపల మాత్రం బితుకు బితుకుమంటూనే ఉన్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. అసెంబ్లీలో అధికార కాంగ్రెస్ను ఎదుర్కోవడం ఒక ఎత్తయితే.. క్షేత్రస్థాయిలో గెలిచిన నేతలను కాపాడుకోవడం మరో ఎత్తుగా మారిందని రాష్ట్రస్థాయి నేతలు సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారు. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా .. అంటే చేసేదేమీ లేదని వాపోతున్నారు.
ఒకప్పుడు అభ్యర్థులు గెలిచినా, ఓడినా పోటీచేసిన నేతలు నమ్మిన పార్టీని అట్టిపెట్టుకొని ఉండేవారు. మళ్లీ ఎన్నికలొచ్చేంత దాకా ప్రజల మధ్య ఉంటూ గెలిచేందుకు పోరాడేవారు. గెలిచేవారు. కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఒక సంప్రదాయానికి తెర లేచింది. బలమైన ప్రత్యర్థులు ఉండరాదు అనే సూత్రాన్ని తాము చదివిన వేల పుస్తకాల్లో ఎక్కడ గ్రహించారో కానీ ప్రతిపక్ష పార్టీల్లో బలమైన నేతలు లేకుండా చేయడమనే విద్యలో ఆరితేరారు. అలా ఒకరా..ఇద్దరా పదుల సంఖ్యలో పార్టీ మార్పిడులు చేయించారు. అలా మారిన వారంతా నిజంగా బీఆర్ఎస్పై ప్రేమ ఉండి చేరారా అంటే అదీ కాదు. సామ దాన దండోపాయాలన్నట్లు రకరకాల విద్యలు ప్రయోగించి వారిని తమ గుప్పిట్లోకి తెచ్చుకున్నారనే ప్రచారం ఉంది. వేరే పార్టీలో వీరులుగా ఉన్నవారు సైతం బీఆర్ఎస్ చెంతన చేరాక బీరువులుగా మారారని రాజకీయపరిశీలకులు చెబుతారు. ఏ విద్యయినా, ఏ ప్రయోగమైనా అన్ని కాలాలూ తమకే అనుకూలంగా ఉండవు. కొంత కాలం వరకు మాత్రం ఎదురు లేకుండా సాగవచ్చు కానీ..అదే విద్య ఎదుటి వారు ప్రయోగించే రోజులు కూడా వస్తాయి. ప్రస్తుతం ఆ తలంపుతోనే బీఆర్ఎస్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది.
అందుకు తగ్గట్లుగానే ఒకరిద్దరు ఎమ్మెల్యేల వ్యాఖ్యలు, వ్యవహారశైలి కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అసెంబ్లీ కారిడార్లలో విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ సీఎం కావడమనేది రేవంత్రెడ్డి చిరకాల వాంఛ అంటూనే.. ఏ ప్రభుత్వాన్నయినా ఆర్నెళ్లలోనే పడిపోవాలని ఆశించడం(శపించడం) సమంజసం కాదని వ్యాఖ్యానించారు. వాస్తవానికి నాగేందర్ కాంగ్రెస్ నేత. గతంలోనూ టిక్కెట్ దక్కదనే తలంపుతో ఓసారి టీడీపీలో చేరినా ఎంతో కాలం ఉండలేక మళ్లీ కాంగ్రెస్ లో చేరారు. పరిస్థితుల వల్ల బీఆర్ఎస్లో దీర్ఘకాలంగా కొనసాగుతుండవచ్చుననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్నుంచే బీఆర్ఎస్లో చేరిన నగర శివార్లలోని మరో ఎమ్మెల్యే సైతం తాను ప్రజల మధ్య ఉండటం వల్లే గెలిచాను తప్ప పార్టీ వల్ల కాదని సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడం ఈ సందర్భంగా గమనార్హం. కొద్ది రోజుల ముందు మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం అయ్యాయి. బహుశా ఇలాంటి వాటివల్లే కాబోలు బీఆర్ఎస్ అగ్రనేతలు గుబులు చెందుతున్నట్లు కనిపిస్తోంది. బీఆర్ఎస్ గెలిచిన 39 సీట్లలోనూ 26 గ్రేటర్ పరిధిలోని జిల్లాల్లోవే కావడంతో గ్రేటర్ నేతలను కాపాడుకునే దిశగా అధిష్ఠానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE