తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన సందర్భంగా రాష్ట్రంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు శుభవార్త చెప్పారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ చేపట్టనున్నట్టు మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. అలాగే సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ కూడా చేయబోతున్నామని అన్నారు.
ఉద్యోగుల సంక్షేమంపై ప్రభుత్వం చేపట్టిన చర్యల గురించి మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, “రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులది కీలకమైన భాగస్వామ్యం. పలు విభాగాలను పరిశీలిస్తే తెలంగాణ ఉద్యోగులు దేశంలోకెల్లా అత్యధిక వేతనాలు పొందుతున్నారని సగర్వంగా తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కన్నా, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల కన్నా మన ఉద్యోగులు మెరుగైన జీతభత్యాలు పొందుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు సమానంగా అంగన్ వాడీ, ఆశా, ఇంకా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫిట్ మెంట్ ఇవ్వటం, దానిని ఏకకాలంలో వర్తింపచేయటం దేశంలోనే ప్రథమం. కేంద్ర ప్రభుత్వం నిధులలో కోతలు పెడుతూ, అనేక ఆర్థిక ఆంక్షలు పెడుతున్నప్పటికీ, రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం పెద్ద ఎత్తున ఆర్థిక అవసరాలు ఉన్నప్పటికీ.. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయుల ప్రయోజనాల విషయంలో ఏనాడూ తక్కువ చేయలేదు” అని అన్నారు.
కొత్త ఈహెచ్ఎస్ విధానం:
“ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తుల మేరకు కొత్త ఈహెచ్ఎస్ విధానాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలో తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేసి ఇందులో ప్రభుత్వ ప్రతినిధులతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయలు, రిటైర్డ్ ఉద్యోగుల ప్రతినిధులను భాగస్వాములగా చేస్తుంది. దీనికి సంబంధించిన విధి విధానాలను ప్రభుత్వం త్వరలోనే ప్రకటిస్తుంది” అని మంత్రి హరీశ్ రావు తెలిపారు.
భారీగా ఉద్యోగ నియామకాలు:
“లోకల్ కేడర్ల ఏర్పాటు మరియు ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో స్థానిక అభ్యర్థులకు రిజర్వేషన్ల వ్యవస్థ రాజ్యాంగంలోని 371 (డీ) ఆర్టికల్ కింద రాష్ట్రపతి ఉత్తర్వుల (PO) ప్రకారం ఉంటుంది. సీఎం కేసీఆర్ పట్టుదల వహించి కొత్త రాష్ట్రపతి ఉత్తర్వులను తెలంగాణ కోసం ప్రత్యేకంగా సాధించారు. ఈ ఉత్తర్వుల ద్వారా తెలంగాణలో 33 జిల్లాలు, 7 జోన్లు, రెండు మల్టీ జోన్లుగా ఉద్యోగ నియామకాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. గతంలో స్థానికులకు 60 నుంచి 80 శాతం వరకు మాత్రమే లోకల్ రిజర్వేషన్లు ఉండేది. ఇప్పుడు అమలు చేస్తున్న నూతన నియామక విధానంతో అటెండర్ నుంచి ఆర్డీవో దాకా స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు లభిస్తాయి. కొత్త నియామకాలు ఈ పద్ధతిలోనే జరుగుతున్నాయి. ఇది తెలంగాణ ప్రభుత్వం సాధించిన చారిత్రాత్మక విజయం. 2014 జూన్ నుంచి ఫిబ్రవరి 2022 దాకా ప్రత్యక్ష నియామక విధానం ద్వారా 1,61,572 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటిలో 1,41,735 పోస్టుల ఎంపిక ప్రక్రియ పూర్తయింది. వీటితో పాటు కొత్తగా 2022 మార్చి నెలలో సీఎం కేసీఆర్ 80,039 పోస్టులను వివిధ కేటగిరీలలో భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటి భర్తీ ప్రక్రియ చురుగ్గా కొనసాగుతోంది. కొత్తగా నియమించబడే ఉద్యోగుల జీతభత్యాల కోసం ఈ బడ్జెట్లో వెయ్యి కోట్లు అదనంగా ప్రతిపాదించడమైనది. ఇచ్చిన మాట ప్రకారం ఏప్రిల్ నెల నుంచి కాంట్రాక్టు ఉద్యోగుల సర్వీసుల క్రమబద్దీకరణ మరియు సెర్ఫ్ ఉద్యోగుల పేస్కేల్ సవరణ చేయబోతున్నాం” అని మంత్రి హరీశ్ రావు ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE