ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వరంగల్ కాకతీయ వైద్య కళాశాల వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం ఆమెకు హైదరాబాద్లోని నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నారు. కాగా డాక్టర్ ప్రీతిని ఇక్కడకు తీసుకొచ్చిన సమయంలోనే పలు అవయవాలు పనిచేయడం లేదని గుర్తించామని, దీంతో ఆమెకు వెంటిలేటర్ సపోర్ట్తో న్యూరాలజీ, జనరల్ ఫిజీషియన్, కార్డియాజిస్టుతో కూడిన ఐదుగురు వైద్యుల బృందం నిరంతరం పర్యవేక్షిస్తున్నదని నిమ్స్ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళి సై గురువారం నిమ్స్ ఆస్పత్రికి వెళ్లి డాక్టర్ ప్రీతిని పరామర్శించారు. స్వతహాగా డాక్టర్ అయిన తమిళి సై ప్రీతికి అందిస్తున్న వైద్యం గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. ఇది చాలా బాధాకర పరిస్థితి. ఒక డాక్టర్గా నేను పరిస్థితిని అర్థం చేసుకోగలను. ఇక వైద్యులు చేయగలిగినంతా చేస్తున్నారు. అయితే ప్రీతి ఆరోగ్య పరిస్థితిపై ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము’ అని వ్యాఖ్యానించారు. కాగా గవర్నర్ రాక సమయంలో అక్కడే ఉన్న ప్రీతి తల్లిదండ్రులు భోరున విలపించారు. మరోవైపు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు కూడా ఘటనపై స్పందించారు. ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పిన ఆయన, ప్రీతి ఆత్మహత్యాయత్నంపై విచారణకు ఆదేశించామని, దీని వెనుక ఎవరున్నా వదిలేది లేదని స్పష్టం చేశారు. ఇక ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ సైఫ్తో పాటు ప్రీతిని కూడా యాజమాన్యం రెండు రోజుల క్రితం పిలిచి కౌన్సెలింగ్ చేశారని, పీజీ స్థాయిలో ర్యాగింగ్ జరిగే అవకాశం తక్కువని, దీనిపై ఇతర విద్యార్థులను కూడా అడిగి వివరాలు తెలుసుకుంటామని కూడా చెప్పారు.
ఇక ఇదిలా ఉండగా మరోవైపు ప్రీతి ఆత్మహత్యాయత్నంపై గురువారం విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. కేఎంసీ ప్రిన్సిపాల్, ఎంజీఎం సూపరింటెండెంట్ సకాలంలో స్పందించకపోవడం వల్లనే పరిస్థితి ఇంతదాకా వచ్చిందంటూ ఏబీవీపీ విద్యార్థులు మరియు గిరిజన శక్తి సంఘం ఆధ్వర్యంలో కేఎంసీ ఎదుట పెద్దఎత్తున ధర్నాకు దిగారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాకతీయ వైద్య కళాశాల మరియు ఎంజీఎం వద్ద భారీగా పోలీసులను మోహరించారు. సీనియర్ మెడికో సైఫ్ వేధింపులతోనే ప్రీతి ఆత్మహత్యాయత్నం చేసిందనే ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన పోలీసులు.. సైఫ్ వాట్సాప్ ద్వారా ప్రీతిని వేధించినట్లు గుర్తించారు. దీంతో సైఫ్ను బుధవారమే అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో సైఫ్పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, ర్యాగింగ్ కేసును నమోదు చేసినట్లు వరంగల్ పోలీసులు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE