తెలంగాణలో గత 46 రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై నవంబర్ 19, మంగళవారం సాయంత్రం తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి తెలిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లపై ప్రభుత్వం చర్చించాలంటూ మూడు రోజులపాటు చేపట్టిన నిరసన దీక్షను సోమవారం సాయంత్రం ఆయన విరమించారు. ఉస్మానియా ఆస్పత్రిలో దీక్ష కొనసాగిస్తున్న అశ్వత్థామరెడ్డికి తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం, మందకృష్ణ మాదిగ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ, మంగళవారం నాడు తలపెట్టిన సడక్ బంద్ను వాయిదా వేస్తున్నామని చెప్పారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీ వచ్చాక సమ్మెపై నిర్ణయం తీసుకుంటామని, అప్పటివరకు ఇలాగే కొనసాగిస్తామని అన్నారు. ముందుగా ఆర్టీసీ జేఏసీలో ఉన్న అన్ని కార్మిక సంఘాలతో చర్చించి, అనంతరం జేఏసీ భేటీలో సమ్మెపై తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు.
మరో వైపు ఆర్టీసీ సమ్మెపై విచారణ చేసిన హైకోర్టు సోమవారం నాడు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ సమ్మె అంశాన్ని ఇకపై కార్మిక న్యాయస్థానం చూసుకుంటుందని కోర్టు తెలిపింది. రెండు వారాల్లోగా సమ్మె సమస్య పరిష్కారమయ్యేలా చూడాలని కార్మిక శాఖ కమిషనర్ కు సూచించింది. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం తీర్పు ఇస్తూ, ‘కోర్టు ముందు రెండు అంశాలు మాత్రమే ఉన్నాయని, మొదటిది సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించడం. రెండోది కార్మికులను చర్చలకు పిలవమని ప్రభుత్వాన్ని ఆదేశించడం. సమ్మె చట్ట విరుద్ధమని ప్రకటించే అధికారం కార్మిక న్యాయస్థానానికి మాత్రమే ఉంటుంది. అలాగే కార్మికులతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించే అధికారం కోర్టుకు ఉందో లేదో చెప్పమని మొదటి నుంచి అడుగుతున్నామని’ పేర్కొంది. ఈ సందర్భంగా ఆర్టీసీ సమ్మెతో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు బస్సులు అందుబాటులో లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోర్టు అభిప్రాయపడింది.
[subscribe]