ఇటీవల చోటుచేసుకున్న ఘటనల నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నారా చంద్రబాబు నాయుడు గన్నవరంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా దాడిలో గాయపడిన టీడీపీ నేతలను, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రిమాండ్లో ఉన్న టీడీపీ నేత దొంతు చిన్నా ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం దాడిలో ధ్వంసమైన టీడీపీ పార్టీ కార్యాలయాన్ని సందర్శించారు. పార్టీ ఆవరణలో తగలబడిన కార్లను, కార్యాలయంలోని రూములను పరిశీలించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడుతూ.. అధికార పార్టీ శ్రేణులు దౌర్జన్యం చేస్తుంటే పోలీసులు అడ్డుకోలేకపోయారని, అధికార పార్టీకి పోలీసులు సహకరించడం దారుణమని చంద్రబాబు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వారి శ్రేణులను రెచ్చగొట్టి ప్రతిపక్ష నేతలపై, వారి ఇళ్లపై, పార్టీ కార్యాలయాలపై దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
గన్నవరం ఏమైనా పాకిస్తాన్ దేశంలో ఉందా? అని ప్రశ్నించిన చంద్రబాబు నాయుడు తనను ఇక్కడ పర్యటించొద్దు అని పోలీసులు చెప్పడంపై అసహనం వ్యక్తం చేశారు. తమ నేతలపై, ఆఫీసులపై వైసీపీ నేతలు, వారి అనుయాయులు దాడులు చేస్తారని, ఇదేమని ప్రశ్నిస్తుంటే తిరిగి తమవారి పైనే కేసులు పెడుతున్నారని విమర్శించారు. ఈ కోవలోనే తమ పార్టీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి మరియు బీసీ నేత దొంతు చిన్నా సహా మరో 10మందిపై అన్యాయంగా కేసులు బనాయించారని, వారికి పార్టీ అండగా ఉంటుందని ప్రకటించారు. తమ పార్టీకి నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర ఉందని, అలాగే తనకు 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉందని, కానీ ప్రస్తుతం ఏపీలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేస్తున్న పాలనను ఎన్నడూ చూడలేదని అన్నారు. తమను బెదిరించి రాజకీయాలు చేయాలనుకుంటే కుదిరే పని కాదని.. ఇలాంటి వారిని తన జీవితంలో ఎంతోమందిని చూశానని, తాడో పేడో తేల్చుకుపోవడానికి తాము సిద్ధమని హెచ్చరించారు. ఇక అధికార పార్టీ ఆగడాలకు రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని పేర్కొన్న చంద్రబాబు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నూటికి వెయ్యి శాతం టీడీపీయే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE