ఆంధప్రదేశ్ రాష్ట్రంలో జగనన్న అమ్మఒడి పథకం రెండో విడత చెల్లింపులు జనవరి 11 వ తేదీన ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. జనవరి 11, సోమవారం నాడు నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఆన్ లైన్ విడుదల ద్వారా విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి నగదు నేరుగా జమచేయనున్నామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. అయితే రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ చేసి, ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్కుమార్ శుక్రవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం నుంచే రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రానుందని ఎస్ఈసీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అమ్మఒడి రెండో విడత ప్రారంభంపై సందేహాలు నెలకొనడంతో మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టతనిచ్చారు.
అమ్మఒడి పథకం రెండో విడత కార్యక్రమం 11 వ తేదీన యథాతథంగా జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమ నిర్వహణ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. అమ్మఒడి కార్యక్రమం నిర్వహణకు సంబంధించి శుక్రవారం నాడు జీవో 3ను విడుదల చేశామన్నారు. నెల్లూరు అర్బన్ ప్రాంతంలో ప్రారంభ కార్యక్రమం జరుగుతుండడం వలన ఎన్నికల కోడ్ పరిధిలోకి రాదని పేర్కొన్నారు. అమ్మఒడి లబ్ధిదారుల సంఖ్య గత ఏడాది కంటే పెరిగిందన్నారు. గత సంవత్సరం 42,24,302 మంది విద్యార్థులకు అమ్మఒడి పథకం అమలు అవగా, ఈ సంవత్సరం 44,00,891 మందికి ఈ పథకం కింద నగదు అందిస్తున్నట్టు మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ