ఉపాధి హామీ పథకాన్ని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ కేంద్రానికి పోస్టుకార్డు రాశారు రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు. ఈ మేరకు ఆయన నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఉపాధి హామీ పథకంపై చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో భాగంగా శనివారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో పోస్టు కార్డు రాశారు. అనంతరం మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ.. కేంద్రం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తోందని, దీనిలో భాగంగానే గత ఏడాది బడ్జెట్లో ఈ పథకానికి 30 వేల కోట్ల కోత విధించారని ఆరోపించారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయంతో ఉపాధి హామీ కూలీలకు పని దినాలు తగ్గాయని, ప్రతి ఎకరాకు నిర్ణీత టోకెన్లుతో పాటు కూలీలకు ఏడాదిలో కనీసం 100 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేశారు.
వ్యవసాయ కూలీకి రోజుకు 257 రూపాయలు ఇవ్వాలని చట్టంలో ఉన్నప్పటికీ, ఒక్కో కూలికి వంద రూపాయలు కూడా ఇవ్వడం లేదని మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే కనీస వేతన చట్టం ప్రకారం 8 గంటలు పనిచేసిన కూలీకి 480 రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పటికీ, ఉపాధి హామీ కూలీలకు దీనిప్రకారం చెల్లింపులు చేయడం లేదని పేర్కొన్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని, ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి ఏపీవోల వరకు ఉపాధి ఉద్యోగులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని మంత్రి కోరారు. ఇక కూలీలకు పని ప్రదేశాల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం లేదని.. విశ్రాంతి కోసం టెంట్లు, మంచి నీళ్లు, పారలు, తట్టలు వంటివి అందించడం లేదని తెలిపారు. ఇంకా ఆన్లైన్ పద్ధతివల్ల గ్రామీణ అటవీ ప్రాంతాల్లోని ప్రజలకు నష్టం జరుగుతోందని, వారికి సెల్ఫోన్ సిగ్నల్స్ సరిగా లేకపోవడంతో ఉదయం 10 గంటలకు, సాయంత్రం 4 గంటలకు కంప్యూటర్లో అప్లోడ్ చేయాలనే నిబంధనలు పాటించలేకపోతున్నారని మంత్రి హరీష్ రావు కేంద్రం దృష్టికి తెచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE