ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మంచిర్యాలలో పర్యటించిన కొన్ని రోజుల తర్వాత, కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మే మొదటి వారంలో తెలంగాణలో పర్యటించనున్నారు. ఈ మేరకు ఆమె పర్యటన వివరాలను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మే 4 లేదా 5న సరూర్నగర్లో నిరుద్యోగుల సమస్యలపై భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని, ఈ కార్యక్రమానికి ప్రియాంకా గాంధీ ముఖ్య అతిథిగా హాజరై నిరుద్యోగ సమస్యపై ప్రసంగిస్తారని తెలిపారు. ఇక దీనికి ముందుగా ఎల్బీ నగర్లోని శ్రీకాంతాచారి విగ్రహానికి నివాళులు అర్పించి, అక్కడినుంచి సభా ప్రాంగణానికి ర్యాలీగా వెళతామని చెప్పారు. ఇంటికో ఉద్యోగం అని సీఎం కేసీఆర్, ఒకే రోజు 2 లక్షల ఉద్యోగాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తే ఒక్క రోజులో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బండి సంజయ్ చెబుతున్నారని.. ఆయన మాటలు వింటే నవ్వాలో, ఏడవాలో అర్థం కావడం లేదని రేవంత్ రెడ్డి అన్నారు. గతంలో కూడా హైదరాబాద్ వరదల సమయంలో బీజేపీ నేతలు బండి పోతే బండి ఇస్తామన్నారని… అయితే ఆ తరువాత ఇన్సూరెన్స్ ఉంది కదా తప్పించుకున్నారని మండిపడ్డారు. అసలు రాష్ట్రవ్యాప్తంగా ఏ శాఖలో ఎన్ని ఉద్యోగ ఖాళీలు ఉన్నాయో బండికి తెలుసా? అని రేవంత్ ప్రశ్నించారు. బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ ఇక్కడ కాదని, ఢిల్లీలోని ప్రధాని మోదీ ఇంటి దగ్గర చేయాలని సవాల్ చేశారు. ఎన్నికల సమయంలో ప్రతీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని దేశ ప్రజలకు హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, అధికారం చేపట్టాక నిరుద్యోగులను మోసం చేశారని, 22 కోట్ల 6 లక్షల దరఖాస్తులు వస్తే.. వాటిలో 7,22,311 ఉద్యోగాలు ఇచ్చామని పార్లమెంట్లోనే ఆయన సమాధానం ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు.
కాగా ఈ సభ కాంగ్రెస్ పార్టీ కోసం కాదని.. రాష్ట్రంలోని నిరుద్యోగుల కోసం చేస్తున్న పోరాటమని స్పష్టం చేసిన రేవంత్ రెడ్డి.. ఈ కార్యక్రమానికి అన్ని నిరుద్యోగ సంఘాలు మద్దతు తెలపాలని కోరారు. మే 9 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్ర రెండో విడత కార్యక్రమం ఉంటుందని, జోగులాంబ జిల్లా నుంచి యాత్ర ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కాగా సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ‘హాత్ సే హాత్ జోడో’ పాదయాత్రలో భాగంగా ప్రియాంక గాంధీ మంచిర్యాల సభకు హాజరవుతారని గతంలోనే ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే, ఆమె కామారెడ్డి జిల్లా జుక్కల్ వద్ద రేవంత్ రెడ్డి పాదయాత్రలో పాల్గొనొచ్చని తెలుస్తోంది. ఇక ఈ ఏడాది చివరిలో తెలంగాణాలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రియాంక గాంధీ పర్యటన నాయకులకు, శ్రేణులకు మంచి ఉత్సాహాన్ని కలిగించొచ్చని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE