భారత సంతతికి చెందిన మాజీ మాస్టర్ కార్డ్ సీఈఓ అజయ్ బంగా 14వ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు వరల్డ్ బ్యాంకు బుధవారం అధికారిక ప్రకటన చేసింది. ఆయన అభ్యర్థిత్వాన్ని బ్యాంకు బోర్డు సభ్యులందరూ ఆమోదించిన అనంతరం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. తద్వారా ప్రపంచ బ్యాంకుకు నాయకత్వం వహించనున్న భారత సంతతికి చెందిన తొలి ఇండో అమెరికన్గా అజయ్ బంగా నిలిచారు. కాగా వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్గా ఆయన ఈ ఏడాది జూన్ 2 నుంచి బాధ్యతలు స్వీకరించనున్నట్లు వరల్డ్ బ్యాంకు ధ్రువీకరించింది. ఇక ఈ పదవిలో ఆయన 5 ఏళ్ల పాటు కొనసాగనున్నారు. కాగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు సాధారణంగా అమెరికన్ అయితే, అంతర్జాతీయ ద్రవ్య నిధి నాయకుడు యూరోపియన్ వ్యక్తి ఉండటం సంప్రదాయంగా వస్తోంది.
ఈ సందర్భంగా ప్రపంచ బ్యాంక్ గ్రూప్ ఎవల్యూషన్ ప్రక్రియలో బంగాతో కలిసి పనిచేయడానికి బోర్డు ఎదురుచూస్తోంది అని వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న కష్టతరమైన అనేక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో ప్రపంచ బ్యాంక్ గ్రూప్ యొక్క అన్ని ఆశయాలు మరియు ప్రయత్నాలపై బంగా సారథ్యంలో ఒక పరిష్కారం కనుగొనబడుతుందని ఆశిస్తున్నాం అని కూడా వారు తెలిపారు. ఇక మొత్తం 189 దేశాలు సభ్యులుగా ఉన్న ప్రపంచ బ్యాంకులో ప్రధానమైన విభాగాలలో పలువురు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారు. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా అన్షులా కాంత్, చీఫ్ ఎకానమిస్ట్గా ఇందర్మిత్ గిల్, చీఫ్ రిస్క్ ఆఫీసర్గా లక్ష్మీ శ్యామ్ సుందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పరమేశ్వరన్ అయ్యర్ తదితరులు ఇప్పటికే కొనసాగుతున్నారు.
అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో 63 ఏళ్ల అజయ్ బంగాను వరల్డ్ బ్యాంకు ప్రెసిడెంట్గా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. కాగా ప్రస్తుత చీఫ్ డేవిడ్ మాల్పాస్ ముందస్తుగా పదవీ విరమణ చేయబోతున్నట్లు ప్రకటించిన నేపథ్యంలో బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. మాల్పాస్ 2019లో అప్పటి అమెరికా డొనాల్డ్ ట్రంప్ చేత ఈ పదవికి నామినేట్ చేయబడ్డారు. వాస్తవానికి ఆయన పదవీకాలం 2024 చివరిలో ముగియాల్సి ఉండగా, దాదాపు ఏడాదిన్నర ముందే బాధ్యతల నుంచి తప్పుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్కు నాయకత్వం వహించేందుకు అజయ్ బంగా సిద్ధమయ్యారు. అయితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం దిశగా వెళ్తుండటం, అభివృద్ధి చెందిన దేశాలు సైతం కఠిన సవాళ్లు ఎదుర్కొంటున్న వేళ అజయ్ బంగా ఈ కీలక బాధ్యతలు చేపట్టనుండటం గమనార్హం.
ఇక 63 ఏళ్ల అజయ్ బంగా ఇటీవలి వరకూ ప్రముఖ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్లో వైస్ ఛైర్మన్గా పనిచేశారు. అంతకుముందు ఆయన మాస్టర్ కార్డ్ సంస్థలో చీఫ్ ఎగ్జిక్యూటివ్గా పనిచేశారు. అజయ్ బంగా 1959 నవంబర్ 10న మహారాష్ట్రలోని పుణెలో జన్మించారు. ఆయన తండ్రి హర్భజన్ సింగ్ బంగా ఇండియన్ ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ గా పనిచేశారు. దీంతో తండ్రి వృత్తి రీత్యా అనేక రాష్ట్రాల్లో అజయ్ బంగా విద్యాభ్యాసం కొనసాగింది. ఈ క్రమంలో ఆయన తన పాఠశాల విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో పూర్తి చేశారు. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. అనంతరం పలు ప్రముఖ సంస్థల్లో పనిచేసి అనుభవం గడించారు. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ ఛాంబర్ ఆఫ్ కామర్స్కు గౌరవ అధ్యక్షుడిగా కూడా బంగా పనిచేశారు. 2016లో భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో అజయ్ బంగాను గౌరవించింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE