తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 24 లక్షల మంది విద్యార్థులకు ప్రభుత్వమే ఉచితంగా పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, వర్క్బుక్స్ మరియు యూనిఫారాలు అందజేయనుంది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బుధవారం విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో తెలిపారు. ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన సహా పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. జిల్లా పరిషత్, మండల పరిషత్, ప్రభుత్వ పాఠశాలలతో పాటు మోడల్ స్కూళ్లు, కేజీబీవీలు, తెలంగాణ రెసిడెన్షియల్ గురుకులాలు, అర్బన్ రెసిడెన్షియల్ సెంటర్లల్లోని విద్యార్థులకు కూడా ఉచితంగా వర్క్బుక్స్, నోట్బుక్స్ అందజేయనున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా సబ్జెక్టుకు ఒకటి చొప్పున నోటు పుస్తకాలను ఇవ్వాలని, వీటిని సమగ్రశిక్ష ప్రాజెక్ట్ నుంచి ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. గత ఏడాది పాఠ్యపుస్తకాలు, నోట్పుస్తకాల పంపిణీకి ప్రభుత్వం రూ.132 కోట్లు వెచ్చించిందిని, ఈ ఏడాది దీనికోసం రూ.200 కోట్లు కేటాయించామని తెలిపారు.
అలాగే ప్రాథమిక పాఠశాలల్లో చదువుతున్న పిల్లలకు వర్క్బుక్లు కూడా అందజేయనున్నామని, వీరితో పాటుగా ఉన్నత పాఠశాలల్లో విద్యార్థులకు నోట్బుక్ల ఆవశ్యకతను ఇప్పటికే పరిగణనలోకి తీసుకోగా, తదనుగుణంగా సరఫరా చేయనున్నామని వివరించారు. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు ద్విభాషా పాఠ్యపుస్తకాలు అందిస్తామని, దీంతో పాటు విద్యార్థులందరికీ రెండు జతల యూనిఫారాలు రూ.150 కోట్లతో అందజేయనున్నామని వెల్లడించారు. కాగా జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో కొత్త విద్యా సంవత్సరం పండుగ వాతావరణంలో ప్రారంభం కావాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. బడిబాట కార్యక్రమం నిర్వహించి స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫాంల పంపిణీని చేపట్టాలని, ఈ కార్యక్రమానికి విద్యార్థుల తల్లిదండ్రులను కూడా ఆహ్వానించాలని సూచించారు. అలాగే ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం కింద చేపట్టిన అన్ని పనులను వేగవంతం చేసి జూన్ మొదటి వారంలోగా పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE