కోవిడ్-19 (కరోనా వైరస్) నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 వరకు 21 రోజుల పాటుగా లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రోజువారీ కూలీలు, వలస కార్మికులు, దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు “ఒకటో తారీఖు” కష్టాలను ఎదుర్కోనున్నాయి. ప్రతి రోజు పని చేసుకుంటే గాని ఇల్లు గడవని కుటుంబాలు ఈ సమయంలో కఠిన పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏప్రిల్ 1తో కొత్త నెల మొదలవనుండంతో కుటుంబ నిర్వహణ, ఇంటి అద్దెలు, నిత్యావసర వస్తువుల కొనుగోలు, అప్పులు, పలు రకాలు బిల్లులు చెల్లించవలసి ఉండంతో కొన్ని లక్షల కుటుంబాలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. శ్రమ జీవనంతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే అన్ని వర్గాల ప్రజలు ఒకటో తారీఖు వస్తుండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే 10 రోజుల నుండి ఎటువంటి ఆదాయం లేకపోవడం, దాచుకున్న కొన్ని డబ్బులు కూడా ఖర్చు అవడంతో ఈ పరిస్థితులను ఎలా దాటాలో తెలియక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.
- పలు పట్టణాలు, నగరాల్లో రోజు వారి కూలీలు అత్యధిక శాతం అద్దె ఇళ్ళలోనే ఉండడంతో ఒకటో తారీఖు అద్దె కట్టాల్సి ఉంటుంది. అద్దె కోసం ప్రజలను ఇబ్బంది పెట్టొద్దని కేంద్రప్రభుత్వం యజమానులను కోరినా కూడా ఎంత మంది పాటిస్తారో అర్ధం కానీ పరిస్థితులు నెలకొన్నాయి.
- ఇప్పటికే చాలా కుటుంబాలు అప్పులతో ఇబ్బందులు ఎదుర్కుంటునందువలన ఈ పరిస్థితులు మరింత కష్టంగా మారనున్నాయి.
- ఈ నేపథ్యంలో కరెంట్ బిల్లులు, వాయిదాలు, ఫైనాన్స్ లు కట్టడాలు, ఈఎంఐ లు చెల్లింపు భారం కానుంది.
- నిత్యావసర వస్తువుల కొనుగోలు, గ్యాస్ కొనుగోలు పేద ప్రజలకు ఇబ్బందిగా మారనుంది.
- ఆటో డ్రైవర్లు, భవన నిర్మాణ కార్మికులు, పలు చిన్న చిన్న సంస్థల్లో రోజువారీ కూలికి పనిచేసే వ్యక్తుల కుటుంబాల నిర్వహణ ప్రశ్నర్ధాకంగా మారనుంది.
- ఈ ప్రతికూల సమయంలో రేషన్ కార్డులో ఉన్నప్రతి వ్యక్తికి 12 కేజీల రేషన్ బియ్యం ఉచితంగా అందజేయడంతో పాటు, ప్రతి రేషన్ కార్డుకు నిత్యవసర వస్తువుల నిమిత్తం రూ.1500 నగదు అందజేస్తామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పేద, సామాన్య ప్రజలకు ఊరట కలిగించింది.
- అలాగే పేదలకు ఉచితంగా రేషన్, పప్పులు అందజేయడంతో పాటుగా, ప్రతి ఇంటికి ఏప్రిల్ 4వ తేదీన వెయ్యి రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించింది.
- తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ లాక్ డౌన్ సమయంలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా పలు రకాల చర్యలు తీసుకుంటూ మరింత సమర్ధవంతంగా వ్యవహరిస్తుండంతో ప్రజలకు కొంతమేరకు ఉపశమనం కలుగుతుంది.
[subscribe]