ఒకరు విప్లవ కవి గద్దర్ కుమార్తె. మరొకరు ఐదుసార్లు ఎమ్మెల్యే అయిన జి.సాయన్న కుమార్తె. ఇద్దరూ ఒకే నియోజకవర్గం నుంచి ప్రత్యర్థులుగా పోటీ చేస్తున్నారు. దివంగతులైన వారి తండ్రుల పేరుతో రాజకీయ రణరంగంలోకి దిగారు. దీంతో ఎవరి సెంటిమెంట్ పండుతుందోనన్న ఉత్కంఠ అంతటా ఏర్పడింది. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. 50 ఏళ్లుగా ఆ నియోజకవర్గానికి మహిళా ప్రాతినిధ్యం లేదు.
కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఇప్పటికి 14సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ఆరు సార్లు, తెలుగుదేశం ఐదు సార్లు, బీఆర్ఎస్, జనతాపార్టీ, ఇండిపెండెంట్ అభ్యర్థులు ఒక్కోసారి విజయం సాధించారు. ప్రస్తుతం సాయన్న కుమార్తె జి.లాస్యనందిత బీఆర్ఎస్ తరఫున, గద్దర్ కుమార్తె డాక్టర్ జి.వెన్నెల కంటోన్మెంట్ నియోజకవర్గం ఎన్నికల బరిలో నిలిచారు. గెలుపుకోసం పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఇద్దరూ తమ తండ్రులు తెలంగాణకు చేసిన ప్రయోజనాలను హైలెట్ చేస్తూ ప్రజలను ఓట్లు అడుగుతున్నారు. ‘తెలంగాణ గడ్డ మీద నెత్తురు చిందించిన ప్రజా యుద్ధనౌక గద్దర్ అన్న బిడ్డగా మీ ముందుకు వచ్చా. వేలు పట్టుకుని నన్ను నడిపించి, గెలిపించండి’ అంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆ పార్టీ అభ్యర్థి వెన్నెల విజ్ఞప్తి చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే ఆమె పార్టీ పెద్దల నుంచి బీ-ఫారం అందుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, దేశ విదేశాల్లో పేరొందిన, కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచిన గద్దర్ కుమార్తెగా తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని, తన తండ్రి సేవలను గుర్తించి, తనకు మార్గదర్శకం చేసి, గెలిపించాలని హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలను కోరారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం, కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి తనకు మద్దతుగా విద్యార్థులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారని ఆమె తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన తండ్రి వినిపించిన గళానికి మద్దతుగా తనను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.
సాయన్న కుమార్తె లాస్య నందిత మాజీ కార్పొరేటర్. ఆమెకు ఇప్పటికే రాజకీయ అనుభవం ఉంది. తన తండ్రిలాగానే కంటోన్మెంట్ ప్రజలకు సేవలు అందిస్తానని ప్రచారం చేస్తున్నారు. తండ్రి హయాంలో కంటోన్మెంట్లో జరిగిన అభివృద్ధిని ప్రజలందరికీ వివరిస్తున్నారు. కారు గుర్తుకు ఓటువేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరుతున్నారు. 1957లో ఇది ఎస్సీ నియోజకవర్గంగా మారింది. ఇక్కడ ప్రస్తుతం 4లక్షలకు పైగా జనాభా ఉంటే, వీరిలో 2లక్షల 39వేల 254మంది ఓటర్లు ఉన్నారు. పురుష ఓటర్లు 1,20,942 మంది ఉంటే, మహిళా ఓటర్లు 1,18,308 మంది, నలుగురు ట్రాన్స్జెండర్లు ఉన్నారు.
ఇదిలాఉండగా.. 1972లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసిన వి.మంకమ్మ ఎమ్మెల్యే కాగా, అంతకు మునుపు, ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మహిళలు కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేలైన దాఖలాల్లేవు. ఈ నెల 30న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాన పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్లు తమ అభ్యర్థులుగా మహిళలను బరిలో నిలిపాయి. దీంతో ఆయా పార్టీల అభ్యర్థుల్లో ఎవరు గెలిచినా ఎంతోకాలం తర్వాత మహిళా ఎమ్మెల్యే ప్రాతినిథ్యం వహించే అవకాశం ఉందని నియోజకవర్గ ఓటర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE