తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి కొనసాగుతూనే ఉంది. ఎన్నికలకు ఇంకా నెల రోజుల సమయం కూడా లేదు. దీంతో ప్రధాన పార్టీలన్నీ స్పీడ్ పెంచేశాయి. ఎన్నికల కదనరంగంలో పరుగులు తీస్తున్నాయి. ప్రచారాలు, బహిరంగ సభలు, ర్యాలీలతో హోరెత్తిస్తున్నాయి. గులాబీ బాస్ రాష్ట్రవ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తుంటే.. జాతీయ పార్టీలు హస్తినా నుంచి అగ్రనేతలను రంగంలోకి దింపుతున్నాయి. అధికార, ప్రత్యర్థి పార్టీల నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. విమర్శలకు, ప్రతివిమర్శలు చేసుకుంటూ రాజకీయాలను హీటెక్కిస్తున్నారు.
కీలకమైన అసెంబ్లీ ఎన్నికలవేళ మేడిగడ్డ వద్ద నిర్మించిన.. లక్ష్మీ బ్యారేజీ బ్రడ్జి కుంగిపోవడం సంచలనంగా మారింది. దీనిని అవకాశంగా మలుచుకొని ప్రత్యర్థి పార్టీలు.. అధికార బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేస్తున్నాయి. సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. అంతకంటే ముందు నుంచే కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవకతవకలు జరిగాయని.. ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఈఘటన ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది. దీంతో ఎన్నికల వేళ ప్రత్యర్థి పార్టీలు.. కాళేశ్వరం ప్రాజెక్ట్లో అవకతవకలు జరిగాయనే విషయాన్ని జనాల్లోకి తీసుకెళ్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
ఇకపోతే ప్రతివారంలానే ఈవారం కూడా తెలంగాణ ఇంటెన్షన్స్.. సర్వే చేసి సంచలన నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం అధికార బీఆర్ఎస్ పార్టీ ముందంజలో దూసుకెళ్తుంటే.. ఆ తర్వాతి స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయి. ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 41 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని సర్వేలో తేలింది. అలాగే కాంగ్రెస్కు 35 శాతం ఓట్లు, బీజేపీకి 13 శాతం ఓట్లు పడే అవకాశం ఉందని వెల్లడయింది. ప్రధాన పార్టీలన్నింటికి పడే ఓటింగ్ శాతం పోయిన వారంతో పోలిస్తే ఈవారం ఒక శాతం పెరిగింది. ఇక హంగ్ వచ్చే అవకాశం 7 శాతంగా ఉందని నివేదికలో తేలింది. అటు ఏ పార్టీకి పడుతాయో తెలియని నాట్ షూర్ ఓట్లు 4 శాతంగా ఉన్నాయి.
పోయిన రెండు, మూడు వారాలతో పోలిస్తే కాంగ్రెస్లో ఈవారం కాస్త జోష్ కనిపిస్తోంది. రాహుల్ గాంధీ వరుస సభలు, పార్టీలోకి అగ్రనేతలు చేరడంతో.. ఆ పార్టీ మరింత బలపడినట్లు తెలుస్తోంది. అటు అగ్రనేతలు బీజేపీని వీడుతున్నప్పటికీ.. ఆ పార్టీలో కూడా కాస్త జోష్ కనిపిస్తోంది. మొన్నటి వరకు బీఆర్ఎస్కు పోటీ కాంగ్రెస్ మాత్రమేనని అనుకున్నారు. ఇప్పుడు బీజేపీ కూడా బీఆర్ఎస్కు పోటీగా నిలవనుందని జనాలు విశ్వసించడం మొదలు పెట్టారు.
ఇక కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్రవ్యాప్తంగా 61 శాతం మంది ఓటర్లు సానుకూల దృక్పథంతో ఉన్నారు. 29 శాతం మంది ఓటర్లు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓటింగ్పై ప్రభావం చూపుతుందని 41 శాతం మంది ఓటర్లు నమ్ముతున్నారు. మరో 22 శాతం మంది ఓటర్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ డిజైన్లో, ప్రాజెక్ట్ కట్టిన సమయంలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తున్నారు. 21 శాతం మంది ఓటర్లు మాత్రం కాళేశ్వరం ప్రాజెక్ట్ను నిర్వహించడం ప్రభుత్వానికి చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని అంటున్నారు. తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అవసరమని 34 శాతం మంది ప్రజలు చెబుతున్నారు. ప్రాజెక్ట్ కట్టకముందుతో పోల్చుకుంటే.. ప్రాజెక్ట్ నిర్మించాక తెలంగాణలో వ్యవసాయరంగం ఎంతో అభివృద్ధి చెందిందని 57 శాతం మంది ఓటర్లు చెబుతున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE