ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో రెండు రోజుల తేడాలోనే రెండు సార్లు తెలంగాణలో పర్యటించారు. ఏకంగా 13,500 కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. వాటితో తెలంగాణ దశ, దిశ మారిపోతుందని, ప్రజలు ఎంతో ప్రయోజనం పొందుతారని తెలిపారు. అయినప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఆశించినంతగా జోష్ పెరగలేదు. సరికదా.. ప్రధాని సభకు ప్రముఖులు సైతం హాజరుకాలేదని, ఆశించిన స్థాయిలో జనసేకరణ చేయలేకపోయారన్న విమర్శలు వచ్చాయి. అంతేకాదు.. ఆ తర్వాత పలువురు ప్రముఖులు బీజేపీని వీడి ఇతర పార్టీలకు వలస వెళ్లిపోయారు.
ఇప్పుడు తాజాగా మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు వస్తున్నారు. హైదరాబాద్లోని ఎల్బీస్టేడియంలో ఈరోజు జరిగే సభలో పాల్గొననున్నారు. సభను విజయవంతం చేయడానికి అగ్రనాయకులు తీవ్రంగా కృషి చేశారు. కొద్ది రోజుల ముందు నుంచే నేతలతో సమావేశాలు నిర్వహించారు. శనివారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో అగ్రనేతలు సమావేశం అయ్యారు. కేంద్ర మంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు. ఇటీవల పార్టీ నుంచి కార్పొరేటర్లు వెళ్లిపోతుండడంతో ముందుగా కేవలం కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించి వారిని బుజ్జగించాలని అనుకున్నారు. అయితే తర్వాత తమ నిర్ణయాన్ని మార్చుకుని పదాధికారులు, గ్రేటర్లోని జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గం పార్టీ అభ్యర్థులతో సమావేశం నిర్వహించారు. ప్రధాని బీసీ గర్జన సభ కోసం చర్చించారు.
గ్రేటర్ హైదరాబాద్లోని బీజేపీ కార్పొరేటర్లకు మంచి భవిష్యత్తు కల్పించడంలో తాము చొరవ తీసుకుంటామని అగ్రనేతలు వారికి హామీ ఇచ్చారు. మున్ముందు మంచి భవిష్యత్తు ఉంటుందని వివరించారు. అభ్యర్థులతో కలిసి ప్రధాని సభ విజయవంతం కావడానికి కృషి చేయాలని కోరారు. నియోజకవర్గాల వారీగా ఎవరికి వారు కార్యకర్తలు, నాయకులను సమీకరించి, పెద్ద ఎత్తున సభకు తరలించాలని దిశా నిర్ధేవం చేశారు. గత నెలలో జరిగిన మోదీ సభకు ఆశించిన స్థాయిలో జనం రాకపోవడంతో ఈసారి రాష్ట్ర నాయకులు బాగా దృష్టి కేంద్రీకరించారు. ప్రధాని సభతో ఈ ఎన్నికల్లో జోష్ పెంచాలని అగ్రనాయకులు భావిస్తున్నారు.
ఇప్పటికే కొంత మంది నాయకులు పార్టీ నుంచి వెళ్లిపోవడం, అభ్యర్థుల ఎంపికలో అసంతృప్తులు, బీజేపీ హవా తగ్గిందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సభకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. బీసీ కార్డును మోదీ ద్వారా బాగా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అభ్యర్థుల ఎంపికలో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చారు. అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి బీసీ అవుతారని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత నెలలో జరిగిన ఓ సభలో ప్రకటించారు. మరోసారి ఈ నినాదాన్ని మోదీ ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. ప్రధాని తాజా సభతోనైనా బీజేపీలో కాస్తయినా ఊపు పెరుగుతుందో.. లేదో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE