తెలుగుదేశం, జనసేన పొత్తు ప్రకటన అనంతరం.. సీట్ల కేటాయింపు అంశం దగ్గరకొచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. పొత్త పార్టీల మధ్య సీట్ల కేటాయింపులో బేధాభిప్రాయాలు రావడం సహజమే. అవి సీట్ల కేటాయింపు లెక్కల్లో.. ఎంపిక చేసుకోబోయే నియోజకవర్గాల్లో ఉంటుంటాయి. అయితే, ప్రస్తుతం సీట్ల లెక్కలు తేలకుండానే, ఏ నియోజకవర్గాలు ఎవరికో తేల్చుకోకుండానే తెలుగుదేశం, జనసేన పార్టీలు వారు రెండు ప్రకటించారుకాబట్టి.. మేమూ రెండు ప్రకటిస్తున్నాం అని చెప్పుకుంటుండడం చర్చనీయాంశం అవుతోంది. రేపో, మాపో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఏ సభలోనో, సమావేశంలోనో మరో నాలుగు సీట్లను ప్రకటిస్తే.. ఆ తర్వాత జనసేన అధినేత కూడా నాలుగు సీట్లు ప్రకటించేస్తారా.. అనేది ఆసక్తిగా మారింది.
ఇప్పుడు ఇదే అంశం వైసీపీకి అవకాశంగా మారుతోంది. ప్రస్తుతం ఏపీలో జనసేన – టీడీపీ ఒక పక్క వేర్వేరుగా సీట్లు ప్రకటిస్తూనే.. అటు చంద్రబాబు అయినా, ఇటు పవన్ కల్యాణ్ అయినా రానున్న ఎన్నికల్లో టీడీపీ – జనసేన కూటమి గెలుపును ఎవరూ ఆడ్డుకోబోరని, కలిసి పోటీ చేసేందుకు మనస్ఫూర్తిగా సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ప్రస్తుతానికి వీరి మధ్యలో బీజేపీ అంశం ఇంకా కొలిక్కి రాలేదు. ఇదిలాఉండగా, ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్యే ఎన్నికల సమరం ఉంటుందని స్పష్టం అవుతోంది. తమిళనాడు తరహాలోనే ఏపీలోనూ ఎన్నికల రాజకీయం ఉంటుంది. జాతీయ పార్టీలకు అవకాశం లేదు. కాంగ్రెస్ పగ్గాలు షర్మిల చేపట్టినా, ఈ ఎన్నికల్లో ఇతర పార్టీల గెలుపు ఓటముల్లో ప్రభావం చూపగలదేమో కానీ, తమ పార్టీ గెలిచేది కష్టమే. షర్మిల ఎంట్రీతో జగన్ ఓటింగ్ చీలిక వచ్చి తమకు మేలు జరుగుతుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. అయితే, షర్మిల రాకతో జగన్ వ్యతిరేక ఓటు మాత్రమే చీలుతుందనేది వైసీపీ ముఖ్య నేతలు విశ్లేషిస్తున్నారు.
కాగా, టీడీపీ – జనసేన సీట్ల లెక్కలు తేలేనాటికి జరగబోయే ఆసక్తికర పరిణామాలను వైసీపీ నేతలు గమనిస్తున్నారు. ఇరుపార్టీలూ సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తుండగానే.. చంద్రబాబు నాయుడు రెండు స్థానాలను ప్రకటించిన నాటి నుంచీ జనసేనలో దీనిపై చర్చ జరుగుతోంది. రిపబ్లిక్ డే ను పురస్కరించుకుని తాజాగా పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ.. తమ పార్టీ నుంచి కూడా రెండు స్థానాలను ప్రకటించారు. రిపబ్లిక్ డే రోజున రాజానగరం, రాజోలు నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందని, ఆర్ (రిపబ్లిక్ డే), ఆర్ (రాజానగరం) ఆర్ (రాజోలు) సక్సెస్ ఫుల్ సంకేతంగా భావిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పొత్తు ధర్మం గురించి కూడా పవన్ మాట్లాడుతూ, చంద్రబాబు తమతో సంప్రదించకుండా రెండు స్థానాల్ని ప్రకటించడాన్ని ఆక్షేపించారు.
మిత్ర ధర్మాన్ని పాటించకుండా రెండు పార్టీలు పొత్తులో ఉన్నప్పుడు రెండు స్థానాలను ఎలా ప్రకటిస్తారని అన్నారు. దీంతో తనపై కూడా ఒత్తిడి ఉండడంతో రెండు స్థానాలు ప్రకటించినట్లు చెప్పారు. ఎన్నికలవేళ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వైసీపీ నేతలకు అవకాశంగానూ మారాయి. దీనిపై మంత్రి అంబటి స్పందించారు. పొత్తు ధర్మమే కాదు, ఏ ధర్మము పాటించని వాడే బాబు అంటూ ఎక్స్లో ట్వీట్ చేశారు. తెలుసుకో తమ్ముడు పవన్ కళ్యాణ్ అంటూ ఎక్స్లో అంబటి ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. ఇక ఈ అంశంపై ఒక్కొక్కరూ స్పందించేందుకు వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరిగి ఇరుపార్టీల్లోనూ గందరగోళం సృష్టించేందుకు వ్యూహాలు పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీజేపీతో పొత్తు విషయంలోనూ చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ఎన్నికల ముందు కంటే తరువాత ఎన్డీఏలో చేరితే ప్రయోజనం అనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. అటు పవన్ మాత్రం బీజేపీతో వెళ్లటమే ప్రయోజనకరమని భావిస్తున్నారు. దీంతో, బీజేపీ నుంచి ఒక స్పష్టత కోసం వేచి చూస్తున్నారు. ఈ అంశంపై కూడా వైసీపీ దృష్టి సారించింది. జరగబోయే పరిణామాలను ఆసక్తిగా గమనిస్తూ రాజకీయ ఎత్తుగడలను వేస్తోంది. ఈ క్రమంలో ఏపీ రాజకీయాలు మున్ముందు మరింత రంజుగా మారనున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY