ఏపీలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఫిబ్రవరి 8 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. తొలిరోజు వాడివేడిగా సమావేశం కొనసాగింది. ఈ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. అయితే ప్రస్తుతం ఏపీలో అధికారంలోవున్న వైసీపీ ప్రభుత్వానికి ఇదే చిట్టచివరి అసెంబ్లీ సమావేశాలు. మరో మూడు నెలల్లో ఎన్నికలు కూడా జరగనున్నాయి. దీంతో ఈ సమావేశాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని వైసీపీ సర్కార్ భావిస్తోంది.ఈ మేరకు పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది. ఐదేళ్లలో తమ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేసిన అభివృద్ధిని అసెంబ్లీ సాక్షిగా వివరించేందుకు వైసీపీ సర్కార్ సిద్ధమయింది.
అదే సమయంలో అసెంబ్లీలో వైసీపీ ప్రణాళికకు చెక్ పెట్టేందుకు తెలుగు దేశం పార్టీ కౌంటర్ స్ట్రాటజీని అమలు చేస్తోంది. ఈ మేరకు చంద్రబాబు అధ్యక్షతన టీడీపీ శాసనసభాపక్షం సమావేశమయింది. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేలా బడ్జెట్ సెషన్లో వ్యవహరించాలని చంద్రబాబుకు ఎమ్మెల్యేలకు సూచించారు. వైసీపీ ప్రభుత్వం అయిదేళ్లలో చేసిన తప్పులను ఎండగట్టాలని అన్నారు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీలను గాలికి వదిలేసి.. 99 శాతం హామీలను నెరవేర్చానని చెప్పుకుంటున్న జగన్ని అసెంబ్లీ సాక్షిగా నిలదీయాలని సూచించారు.
అలాగే ప్రజాకోర్టు పేరుతో చంద్రబాబు నాయుడు చార్జిషీటును విడుదల చేశారు. అయిదేళ్లలో వైసీపీ ప్రభుత్వ అక్రమాలను.. ప్రజలను ఇబ్బంది పెట్టిన వైనాలను దానిలో రూపొందించారు. అలాగే వైసీపీ ప్రభుత్వం అమలు చేయని హామీలను కూడా అందులో పేర్కొన్నారు.
మరోవైపు తొలిరోజు అసెంబ్లీ వద్ద టీడీపీ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బైబై జగన్ అంటూ ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈక్రమంలో హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పోలీసుల తీరుపై భగ్గుమన్నారు. అసెంబ్లీకి వెళ్తున్న ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిదని బాలకృష్ణ ప్రశ్నించారు. అలాగే వైసీపీ సర్కార్ పని అయిపోయిందని.. మరో మూడు నెలలే వైసీపీ అధికారంలో ఉండేదని చెప్పుకొచ్చారు. ఇప్పటికే జగన్కు ఓటమి భయం పట్టుకుందని చెప్పుకొచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE