ఏపీ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయంపై రాష్ట్ర హైకోర్టు కీలక తీర్పును ఇచ్చింది. మూడు రాజధానులు మరియు సీఆర్డీఏ రద్దు పిటిషన్లపై విచారణకు అంగీకరించిన హైకోర్టు దీనిపై ఈరోజు (గురువారం) తీర్పుని వెలువరించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనికి సంబంధించి మొత్తం 70 పిటిషన్లపై విచారించిన త్రిసభ్య ధర్మాసనం ఈరోజు ఉదయం తీర్పునిచ్చింది. సీఆర్డీఏ చట్టం ప్రకారమే ప్రభుత్వం వ్యవహరించాలని స్పష్టం చేసింది. పిటిషన్ల ఖర్చు కోసం రూ. 50 వేలు ఇవ్వాలని కోర్టు తెలిపింది. కాగా, రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదని కోర్టు స్పష్టం చేసింది.
రాష్ట్ర రాజధాని కోసం తమ జీవితాలకు ఆధారమైన భూములిచ్చిన రైతులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని కోర్టు అభిప్రాయపడింది. మూడు నెలల్లోనే రైతులకు అభివృద్ధి చేసిన ప్లాట్లు అప్పగించాలని ధర్మాసనం గడువుని కూడా విధించింది. సీఆర్డీఏ చట్టంలో చేసుకున్న ఒప్పందాల ప్రకారం అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేసిన ప్లాట్లు రైతులకు అందివ్వాలని ప్రభుత్వానికి కోర్టు సూచించింది. అలాగే, అమరావతి అభివృద్ధి పనులపై ఎప్పటికప్పుడు కోర్టుకు నివేదిక సమర్పించాలని కోర్టు ఆదేశించింది. రాజధాని అమరావతికి సంబంధించిన భూములను తనఖా పెట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఆ భూములను రాజధాని అవసరాలకు తప్ప మిగిలిన ఏ ఇతర అవసరాలకు వాడుకోరాదని కోర్టు తెలిపింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ