దర్శకధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి తన తదుపరి చిత్రంపై ఈ రోజు కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం తెరకెక్కిస్తున్న రౌద్రం రణం రుధిరం(ఆర్ఆర్ఆర్) చిత్రం తర్వాత తన తదుపరి చిత్రం సూపర్స్టార్ మహేశ్ బాబు తోనే ఉంటుందని రాజమౌళి స్పష్టం చేశారు. తాజాగా ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో రాజమౌళి మాట్లాడుతూ, ప్రస్తుతం చేస్తున్న డీవీవీ దానయ్య చిత్రం తర్వాత ఎప్పటినుంచో చెప్పిన విధంగా నిర్మాత కేఎల్ నారాయణ, మహేశ్ బాబు, తన కాంబినేషన్లో ప్రాజెక్ట్ యే పట్టాలెక్కుతుందని అన్నారు.
గత కొన్నిరోజులుగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత రాజమౌళి-ప్రభాస్ కాంబినేషన్ లో మరో సినిమా రానుందని సోషల్మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో తన తదుపరి చిత్రం గురించి రాజమౌళి స్పష్టతనివ్వడంతో అన్ని రూమర్స్కు చెక్ పడినట్లయింది. ఎప్పటి నుంచో రాజమౌళి, మహేశ్బాబు కాంబినేషన్లో సినిమాకోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి స్పష్టత రావడంతో ప్రిన్స్ అభిమానులు, సినీ ప్రియులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.