కరోనావైరస్ నియంత్రణ చర్యలు మరియు దేశవ్యాప్తంగా లాక్డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తగ్గించే మార్గాలపై చర్చించడానికి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర మంత్రుల కమిటీ ఏప్రిల్ 18, శనివారం నాడు సమావేశమైంది. కరోనా వైరస్ వ్యాప్తి నివారణపై సలహాలు ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఈ కేంద్ర మంత్రుల బృందాన్ని నియమించారు, కాగా వీరు సమావేశం కావడం ఇది ఐదవసారి. లాక్డౌన్ పొడిగింపు, ఏప్రిల్ 20 వ తేదీ నుంచి దేశంలో ఇప్పటికే ప్రకటించిన నాన్ హాట్స్పాట్, గ్రీన్ జోన్లలో కొన్ని రంగాలకు, ఆర్థిక కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చే అంశంపై కేంద్రమంత్రులు చర్చించినట్లుగా తెలుస్తుంది. ఈ నెల 20 తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలను అనుమతులు ఇచ్చే విషయంపై పలు మంత్రిత్వ శాఖల నుంచి తగిన సమాచారాన్ని మంత్రుల బృందం తీసుకున్నట్టు సమాచారం.
కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా పలు రాష్ట్రాల్లోని స్థానిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుందని, అలాగే ప్రజలకు సహాయం అందించే అంశంపై వీరు చర్చించినట్టు తెలుస్తోంది. తాజాగా రిజర్వ్ బ్యాంక్ ప్రకటించిన నిర్ణయాలు, గరిబ్ కళ్యాణ్ యోజన పథకాలపై కూడా కేంద్ర మంత్రుల బృందం అభిప్రాయాలు తీసుకున్నట్టు సమాచారం. ఈ సమావేశానికి మంత్రులు రాజ్నాథ్ సింగ్, గజేంద్ర సింగ్ షేకావత్, పీయూష్ గోయల్, రాంవిలాస్ పాశ్వాన్, స్మృతీ ఇరానీ, ప్రకాష్ జవదేకర్, కిషన్ రెడ్డి, ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరి, రమేష్ పోఖ్రియాల్, తదితరులు హాజరయ్యారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu