ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా కరోనా నిర్ధారణ వైద్య పరీక్షల కోసం దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను ప్రభుత్వం దిగుమతి చేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 17, శుక్రవారం నాడు సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ టెస్ట్ కిట్లను ప్రారంభించారు. ఈ ర్యాపిడ్ టెస్టు కిట్ల ద్వారా కేవలం 10 నిమిషాల వ్యవధిలోనే కరోనా ఫలితాన్ని కనుక్కోవచ్చని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో కరోనా వ్యాప్తి నివారణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
” కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత వేగంగా నిర్వహించేందుకు దక్షిణ కొరియా నుంచి లక్ష సత్వర పరీక్ష (రాపిడ్ టెస్ట్) కిట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దిగుమతి చేసుకోవడం ముదావహం. వీటి ద్వారా 10 నిమిషాల్లోనే ఫలితాలు రావడం.. రోజుకు 10వేల మందికి పరీక్షలు నిర్వహించే అవకాశం ఉండటం మంచి పరిణామం. ఈ పరికరాల ద్వారా కరోనా కేసుల్లో ప్రాథమిక పరీక్షలను వీలైనంత త్వరగా గుర్తించడం ద్వారా మరింత పకడ్బందీగా కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలను చేపట్టేందుకు వీలవుతుందని” ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. మరోవైపు కరోనా నిర్ధారణ పరీక్షల కోసం ఇప్పటికే దక్షిణ కొరియా నుంచి లక్ష ర్యాపిడ్ టెస్టు కిట్లను తెప్పించిన రాష్ట్ర ప్రభుత్వం, త్వరలోనే మరో 9 లక్షల కిట్లను దిగుమతి చేసుకోనున్నట్టు సమాచారం.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu