కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో ఏప్రిల్ 20, ఆదివారం నాడు మంత్రిమండలి సమావేశం జరిగింది. అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 858కి చేరిందని, వీరిలో 21 మంది మృతి చెందగా 186 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారని తెలిపారు. ప్రస్తుతం 651మంది చికిత్స పొందుతున్నారని చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏప్రిల్ 20 నుంచి రాష్ట్రంలో ఎలాంటి సడలింపులు ఉండవని, మే 7 వరకు రాష్ట్రంలో లాక్డౌన్ ను పొడిగిస్తునట్టు సీఎం కేసీఆర్ వెల్లడించారు.
సీఎం కేసీఆర్ ప్రెస్ మీట్ ముఖ్యాంశాలు:
- రాష్ట్రంలోని వరంగల్ రూరల్, యాదాద్రి భువనగిరి, సిద్దిపేట, వనపర్తి జిల్లాల్లో ఒక్క కరోనా కేసు లేదు.
- ఏప్రిల్ 20 నుంచి మే 7 వరకు లాక్డౌన్ నిబంధనలు యథాతథంగా కొనసాగుతాయి, ఎలాంటి సడలింపులు లేవు.
- విదేశీ ప్రయాణికులంతా క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు, ఇప్పుడు కొనసాగుతున్నది నిజాముద్దీన్ కేసులే.
- మే 1వ తేదీ తరువాత కరోనా కేసుల విషంయంలో కొంత ఊరట వచ్చే అవకాశం ఉంది.
- మే 5వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించి అప్పటి పరిస్థితికి అనుగుణంగా తిరిగి మళ్ళీ నిర్ణయం తీసుకుంటాం.
- మే 7 వరకు ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలైన స్విగ్గీ, జుమాటోలకు అనుమతి రద్దు.
- ఎలాంటి పండగలైనా ఇళ్లలోనే జరుపుకోవాలి, ఈ నిబంధనలు ఏ ఒక్క మతానికో పరిమితం కాదు. రంజాన్ మాసం ప్రారంభమైనా కూడా రాష్ట్రంలో ఎటువంటి సామూహిక ప్రార్థనలకు అనుమతి లేదు.
- తెలంగాణలో ఏ ఒక్క వ్యక్తి ఉపవాసం ఉండకూడదు, ఆరోగ్యసేవలకోసం ఇబ్బంది పడ్డొద్దు.
- మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఇంటి కిరాయిదారులను యజమానులు ఇబ్బంది పెట్టొద్దు, వాయిదా పద్ధతిలో చెల్లించే అవకాశం ఇవ్వాలి, మరియు వడ్డీ వసూలు చేయకూడదు.
- ఇంటి అద్దెల విషయంలో ఎవరైనా ప్రభుత్వ ఆదేశాలను అతిక్రమిస్తే డయల్ 100కి కాల్ చేసి చెప్తే చర్యలు తీసుకుంటాం.
- రాష్ట్రంలో వివిధ పరిశ్రమల యజమానుల విజ్ఞప్తి మేరకు మే నెలకు సంబంధించి పరిశ్రమల ఫిక్స్డ్ ఛార్జీలు రద్దు.
- 2020-21 విద్యా సంవత్సరానికి ప్రైవేట్ విద్యా సంస్థలు ఫీజులు పెంచకూడదు. ఇతర ఫీజులు లేకుండా కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే నెలవారీగా వసూలు చేయాలి.
- గతనెల మాదిరిగానే తెల్లరేషన్ కార్డులో ఉన్న ఒక్కో కుటుంబ సభ్యునికి 12 కేజీల బియ్యం, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 నగదు అందజేస్తాం.
- గచ్చిబౌలి స్టేడియంలోని స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఉన్న 540 గదుల భవనాన్ని క్రీడాశాఖ నుంచి వైద్య ఆరోగ్యశాఖకు బదిలీ చేస్తూ కేబినెట్ నిర్ణయం.
- గచ్చిబౌలిలో 1500 పడకలతో కరోనా ప్రత్యేక ఆస్పత్రిని సిద్ధం.
- ఆ తర్వాత ఆ ఆస్పత్రికి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ (టిమ్స్)గా నామకరణం చేసి, అత్యంత అధునాతన సదుపాయాలతో పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తాం.
- క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో సమగ్ర క్రీడా విధానం కోసం కేబినెట్ సబ్కమిటీ.
- ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ ఉద్యోగులకు గతనెల పద్దతిలోనే ఈనెల కూడా వేతనాలు ఉంటాయి.
- పోలీస్ సిబ్బంది బాగా పనిచేస్తున్నారు, వారి గ్రాస్ సాలరీకి పదిశాతం సియంగిప్ట్ గా అందిస్తాం.
- విద్యుత్ ఉద్యోగుల సేవలు అభినందనీయం, వారికి ఈనెల కోతలేకుండా పూర్తి వేతనం ఇస్తాం.
- పింఛనుదారులకు ఈనెల 75 శాతం పింఛను చెల్లించాలని కేబినెట్ నిర్ణయం.
- దేశ చరిత్రలో తొలిసారిగా రైతులు పండించిన పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.
మరో నెలరోజుల పాటు రాష్ట్రంలో వేడుకలకు అనుమతివ్వం. - కల్యాణ మండపాలను ఎరువులు, పంటల నిల్వకు వాడుకోవాలని కలెక్టర్లను ఆదేశాలిచ్చాం.
- 135 కోట్ల మందికి అడ్డుకున్నా అన్నంపెట్టేట్టోడు ఈ భూమి మీద లేరు, అందుకే వ్యవసాయాన్ని బ్రతికించుకోవాలి.
- ఇప్పుడు ప్రతిరోజూ 1500 పరీక్షలు జరిపే కెపాసిటీ ప్రభుత్వానికి ఉంది, ఒకవేళ పరిస్థితి దాటితే ప్రైవేట్ సేవల గురించి ఆలోచిస్తాం.
- అమెరికాలో ఒకే ఇంట్లో 27 మృతదేహాలు పడి ఉన్నాయంటున్నారు. అలాంటి దయనీయ పరిస్థితి ఎవరికీ రావద్దు.
- రాష్ట్రాలకు ఎఫ్ఆర్బీఎం పరిమితి పెంచాలని ఇప్పటికే విజ్ఞప్తి చేశాం. ఈ సమయంలో రాష్ట్రాలకు కేంద్రం అవసరమైన సహాయంతో పాటుగా వెసులుబాటులు ఇవ్వాలి.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]