తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ఈ రోజు (ఏప్రిల్ 19, ఆదివారం) మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రగతి భవన్ లో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరుగనుంది. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకుంటున్న చర్యలు, లాక్డౌన్ అమలు తదితర అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం పూర్తిస్థాయిలో కట్టుదిట్టంగా అమలవుతున్న లాక్డౌన్ ను మే 3 వరకు యథావిధిగా కొనసాగించాలా? లేదా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఏప్రిల్ 20 తర్వాత రాష్ట్రంలో కొన్నిరంగాలకు, ఇతర ఆర్ధిక కార్యకలాపాలకు సడలింపులు ఇవ్వడమా? అనే అంశంపై ఈ కేబినెట్ భేటీలో చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశముంది.
కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్డౌన్ ను పొడిగిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 20 వరకు దేశంలో లాక్డౌన్ కఠినమైన రీతిలో అమల్లో ఉంటుందని, ఇక ఏప్రిల్ 20 తర్వాత దేశంలో వైరస్ వ్యాప్తి చెందని సురక్షిత ప్రాంతాల్లో కొంతమేర లాక్డౌన్ సడలింపు ఉండవచ్చని తెలిపారు. ఒకవైపు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ అమలులో సడలింపులు ఇవ్వాలా వద్దా అనే అంశంపై చర్చ జరుగుతుంది. రాష్ట్రంలో ఏప్రిల్ 18, శనివారం నాటికీ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 809కి పెరిగింది. మొత్తం 809 మందిలో 186 మంది వైరస్ లక్షణాల నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, 18 మంది మరణించారు. ప్రస్తుతం 605 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu
[subscribe]