ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెం. 1కి వ్యతిరేకంగా త్వరలో ‘ఛలో తిరుపతి’ నిర్వహిస్తామని ప్రకటించారు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఈ మేరకు ఆయన మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి భారతి పవార్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి సునీల్ దేవధర్ మరియు పలువురు కీలక నాయకులు హాజరయ్యారు. మంత్రి భారతి పవార్ జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం ప్రారంభమైన సమావేశాలలో నేతలు పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ.. ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనే సత్తా బీజీపీకే ఉందని, వచ్చే ఎన్నికల్లో బటన్ నొక్కి పార్టీని అధికారంలోకి తీసుకురావాలని నాయకులకు పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం సంక్షేమం పేరుతో ఎడాపెడా అప్పులు చేస్తోందని, ఇది ఇలాగె కొనసాగితే భవిష్యత్ తరాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని విమర్శించిన ఆయన కావాలంటే దీనిపై బహిరంగ చర్చకు కూడా సిద్ధమని తెలిపారు. కుటుంబ రాజకీయాలను మరియు అవినీతి రాజకీయాలను దేశంలో లేకుండా చేయాలన్నదే బీజేపీ లక్ష్యమని, దీనికోసం నేతలంతా ఐకమత్యంగా పనిచేయాలని సూచించారు. నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ పాదయాత్ర చేయలేదా? అని ప్రశ్నించిన ఆయన, ఇప్పుడు కొత్తగా జీవో నెం. 1 ఎందుకు తీసుకొచ్చారని మండిపడ్డారు. దీనిని నిరసిస్తూ త్వరలో ‘ఛలో తిరుపతి’ నిర్వహిస్తామని, శ్రేణులందరూ పాల్గొని విజయవంతం చేయాలని సోము వీర్రాజు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE