హర్యానాలో ఊహించని విజయాన్ని సొంతం చేసుకున్న BJPకి..జమ్మూకాశ్మీర్లో మాత్రం కాస్త ఎదురుదెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. అక్కడ కచ్చితంగా తమ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆ పార్టీ అగ్రనేతలు ముందు నుంచీ లెక్కలు వేశారు. ఆర్టికల్ 370 తర్వాత జరిగిన అభివృద్ధే తమను గెలిపిస్తుందని ధీమాతో ఉన్నారు.
కానీ అనుకోకుండా జమ్మూకాశ్మీర్ ప్రజలు కాంగ్రెస్, ఎన్సీ కూటమికి పట్టం కట్టారు. అయినా కూడా జమ్ముకాశ్మీర్లో కాంగ్రెస్, ఎన్సీ కంటే బీజేపీకే ఎక్కువగా ఓటు షేర్ వచ్చింది. మరోవైపు 29 స్థానాలతో రెండో అతిపెద్ద పార్టీగానూ బీజేపీ అవతరించింది.
ఇదిలాఉంటే, జమ్మూకాశ్మీర్లో తమకు పట్టున్న రెండు స్థానాల్లో బీజేపీ ఓటమి పాలవడంతో అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది . హిందూ ఓటర్లు ఎక్కువగా ఉన్న బానీ, రాంబన్ నియోజకవర్గాల్లో బీజేపీ ఓటమిని చవి చూస్తుందని అగ్రనేతలు ఏ మాత్రం ఊహించలేదు.
బానీ స్థానంలో బీజేపీ అభ్యర్థి జెవాన్ లాల్పై స్వతంత్ర అభ్యర్థి అయిన రామేశ్వర్ సింగ్ ఏకంగా 18,672 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు. రాంబన్లో ఎన్సీ అభ్యర్థి అర్జున్ సింగ్ 8,869 ఓట్ల మెజార్టీతో విజయాన్ని సాధించారు.
అయితే 2014లో జరిగిన ఎన్నికల్లో ఆ రెండు స్థానాల్లోనూ బీజేపీ విజయ ఢంకా మోగించింది. అదే ఊపు ఇప్పుడు కూడా వస్తుందని అనుకున్న బీజేపీ పెద్దలకు ఆ రెండు స్థానాల్లో మెజార్జీ హిందువులున్నా సరే..ఎందుకు ఓడిపోవాల్సి వచ్చిందా అని ఆలోచనలో పడ్డారు.