బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ విషయంలో సరి కొత్త సంచలనానికి నాంది పలికింది. గత కొన్ని రోజులుగా జమ్మూ కశ్మీర్ లో ఏమి జరుగుతుందనే ఉత్కంఠకు తెరదించుతూ ఆగస్ట్ 5న ఆర్టికల్-370 రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జమ్మూ కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తి కలిపిస్తున్న ఆర్టికల్-370 ని రద్దు చేయడం ద్వారా ఆ రాష్ట్రానికి ఇప్పటివరకు ఉన్న ప్రత్యేక రాజ్యాంగం, అధికారాలు అన్ని పూర్తిగా రద్దు అవుతాయి. ఇప్పుడు భారత రాజ్యాంగంలోని నిబంధనలు, నియమాలు అన్ని జమ్మూ కశ్మీర్ కు వర్తిస్తాయి. జమ్మూ కశ్మీర్ లో స్థానికత, మరియు ప్రత్యేక అధికారాలు కల్పించే ఆర్టికల్-35ఏ కూడ రద్దయిపోయింది.
జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే బిల్లును కూడ కేంద్రప్రభుత్వం పార్లమెంట్ ముందుకు తెచ్చింది. ముందుగా బిల్లును రాజ్యసభలో ప్రవేశ పెట్టి దానిపై చర్చ జరిపారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా జమ్మూ కశ్మీర్, ఎటువంటి చట్టసభ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లద్దాఖ్ ను విభజించారు. జమ్మూ కశ్మీర్ విభజన బిల్లు, ఆర్టికల్-370 రద్దు ఒకేసారి రాజ్యసభలో పెట్టి కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేయించుకుంది. ఆర్టికల్-370 రద్దుకు మూజువాణి ఓటుతో రాజ్యసభ మద్దతు తెలిపింది. అయితే జమ్మూ కశ్మీర్ విభజన బిల్లుకు సభలో 125 మంది సభ్యులు మద్దతు తెలుపగా, 61 మంది సభ్యులు వ్యతిరేకించారు. ఈ బిల్లును కాంగ్రెస్, డిఎంకే, వామపక్షాలు, ఎస్పీ లాంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. సోమవారం రోజే లోక్ సభలో కూడ హోం మంత్రి అమిత్ షా విభజన బిల్లును ప్రవేశ పెట్టారు. దీనిపై మంగళవారం నాడు పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదించనున్నారు.
[subscribe]
[youtube_video videoid=c-1S-CTxdWk]