చైర్మన్ చంద్రబాబు.. వైస్‌ చైర్మన్‌ పవన్‌ కళ్యాణ్‌

నారా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎంగా మాత్రమే కాదు. పలు సంస్థలకు చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. ఏపీలో అన్ని పనులను చక్కబెట్టడానికి, అభివృద్ధిని శరవేగంగా పట్టాలెక్కించడానికి ఆయన చైర్మన్‌ గా కూడా బాధ్యతలను భుజాన వేసుకున్నారు. తన డ్రీమ్‌ ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి.. చైర్మన్‌ చంద్రబాబుగా మారిపోయారు. అనుకున్న లక్ష్యాలను సాధించడానికి, ప్రాజెక్టులను చకచకా ముందుకు తీసుకుని వెళ్లేందుకు చైర్మన్‌ అవతారం ఎత్తారు . ఏపీకి పోలవరం, అమరావతి రెండు కళ్లు అని సీఎం చంద్రబాబు తరచూ చెబుతుంటారు . అందుకే ఆ పోలవరాన్ని కలిపే జలహారతి నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనుల వరకూ అంతా తానే చూసుకుంటున్నారు.

మరోవైపు సంపద సృష్టించి సంక్షేమ పథకాలను అమలు చేయాలనే ఆలోచన సీఎం కు ఉంది. దీనికి ఆచరణ రూపం ఇస్తూ..చంద్రబాబు మానస పుత్రిక పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్‌నర్‌షిప్ తో P-4 రూపు దిద్దుకుంది. 2047 నాటికి ఏపీలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడం సహా సామాజిక-ఆర్థిక అసమానతలను తగ్గించడం అలాగే సమగ్ర అభివృద్ధిని సాధించడం లక్ష్యంగా స్వర్ణాంధ్ర -2047 విజన్ ఆధారంగా ఏపీ సర్కార్ ఈ కార్యక్రమం అమలు చేస్తోంది.ఇటీవల సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

పీ4 విధానం ప్రకారం టాప్ పదిశాతంలో ఉన్న సంపన్న వ్యక్తులు కానీ పెద్ద పెద్ద సంస్థలు కానీఅట్టడుగున ఉన్న 20 శాతం పేద కుటుంబాలను ఆదుకోవాలి. అంటే పేద కుటుంబాలకు స్థలాలు, ఇళ్ల నిర్మాణం, పారిశుద్ధ్యం, తాగునీటి సదుపాయం, ఎల్‌పీజీ కనెక్షన్లు, విద్యుత్ సరఫరా వంటి సౌకర్యాలను వీరు కల్పించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీని ఆచరణలో తాజాగా మరో ముందడుగు పడింది. సీఎం చంద్రబాబు చైర్‌ పర్సన్‌గా P-4 సొసైటీ ఏర్పాటవగా.. దీనికి వైస్‌ చైర్‌ పర్సన్‌గా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఉంటారు. సంపన్నులు 5 లక్షల బంగారు కుటుంబాలను దత్తత తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలనే లక్ష్యంగా చంద్రబాబు రంగం సిద్ధం చేస్తున్నారు.

అలాగే నెంబర్‌ 2.. జలహారతి కార్పొరేషన్‌. పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టడానికి ఏపీ సర్కార్‌ దీన్ని ఏర్పాటు చేసింది. కంపెనీల చట్టం కింద వంద శాతం స్పెషల్ వాహక సంస్థగా జలహారతి కార్పొరేషన్ ఏర్పాటయింది. దీనికి చైర్మన్‌గా సీఎం చంద్రబాబు ఉండగా.. మంత్రి నిమ్మల రామానాయుడు వైస్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
ఇక ఏపీకి రెండు కళ్ల వంటి పోలవరం ప్రాజెక్ట్‌, రాజధాని అమరావతి…ఈ రెండింటిని పూర్తి చేసే బాధ్యతా తన భుజస్కంధాల పైనే వేసుకున్నారు చంద్రబాబు. జలహారతి, P-4 ప్రాజెక్టులు కూడా చంద్రబాబు నేతృత్వంలోనే అడుగులు ముందుకు వేయబోతున్నాయి. ఇలా సీఎం బాధ్యతలతో పాటు.. తన డ్రీమ్ ప్రాజెక్టులు ముందుకు తీసుకు వెళ్లడానికి చంద్రబాబు చైర్మన్‌గా మారడం అందరినీ ఆశ్చర్చపరుస్తోంది.