ప్రజాచైతన్య యాత్రలో భాగంగా ఉత్తరాంధ్ర పర్యటన కోసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫిబ్రవరి 27, గురువారం ఉదయం విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో విమానాశ్రయానికి చేరుకున్నారు. మరోవైపు చంద్రబాబును అడ్డుకునేందుకు వైసీపీ శ్రేణులు భారీగా చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో చంద్రబాబు కాన్వాయ్ పై పలువురు కోడిగుడ్లు, టమాటాలు విసిరారు. అలాగే పలువురు వైసీపీ నాయకులు చంద్రబాబు కాన్వాయ్ చుట్టుముట్టి వాటికి అడ్డంగా పడుకొన్నారు. దీంతో చంద్రబాబు కాన్వాయ్ పూర్తిగా నిలిచిపోవడంతో భద్రతా సిబ్బంది ఒక్కసారిగా అప్రమత్తమై ఆయన వాహనానికి రక్షణ వలయంగా నిలిచారు.
వైసీపీ నాయకులు ‘గో బ్యాక్’ పోస్టర్లు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ కార్యకర్తల నినాదాలు, చర్యలతో ఎయిర్ పోర్ట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకుంది. అలాగే ఎయిర్ పోర్ట్ వద్ద జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా నిలిచిపోయింది.ఈ నిరసనల క్రమంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు టీడీపీ నేత, వైజాగ్ ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కారు అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో టీడీపీ కార్యకర్తలు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడు రాజధానుల నిర్ణయంలో భాగంగా విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా చంద్రబాబు విశాఖకు వచ్చారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా పెందుర్తి ల్యాండ్ పూలింగ్ బాధితులతో చంద్రబాబు సమావేశం అవ్వనున్నారు. అనంతరం శృంగవరపు కోట, కొత్తవలసలో ప్రాంతాలలో అన్నక్యాంటీన్ల తొలగింపుపై చేపట్టే నిరసన కార్యక్రమాల్లో చంద్రబాబు పాల్గొంటారు. అదే విధంగా రాంపురం గ్రామంలో వివాదాస్పదమైన వీర్రాజు చెరువును కూడా చంద్రబాబు సందర్శించనున్నారు.
[subscribe]