ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 14, మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఏపీ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేశారు. మార్చి 14న ఉదయం 10 గంటలకు ఉభయసభలు (శాసనసభ, శాసన మండలి) ప్రారంభం కానుండగా, బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో ముందుగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయసభలనూ ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఇటీవలే తొలిసారిగా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన అబ్దుల్ నజీర్ ఏపీ అసెంబ్లీలో మొదటిసారి ప్రసంగించనున్నారు. ఇక అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాక బీఏసీ సమావేశం నిర్వహించి సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, బడ్జెట్ ప్రవేశపెట్టడం, బడ్జెట్ పై చర్చ, ప్రవేశపెట్టే బిల్లులు సహా ఇతర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. కాగా వారం లేదా పది రోజుల పాటుగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టు సమాచారం.
మరోవైపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజునే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మొదటి రోజు ఉభయసభలు వాయిదా పడ్డాక సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన కేబినెట్ సమావేశమై రాష్ట్ర బడ్జెట్ 2023-24కి ఆమోదం తెలపడంతో పాటుగా, అసెంబ్లీలో ప్రవేశపెట్టే పలు బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE