ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఆరవ రోజుకి చేరుకున్నాయి. బడ్జెట్పై చర్చ కొనసాగుతోంది. ఈరోజు విద్యుత్ శాఖకు సంబంధించిన రెండు వార్షిక నివేదికలను మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. అలాగే, వ్యాట్ సవరణ బిల్లును సభలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు. అయితే, మరోవైపు శాసనసభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్న సమయంలోనే టీడీపీ సభ్యులు తమ నిరసన తెలియజేస్తున్నారు. జంగారెడ్డిగూడెం మరణాలపై ప్రత్యేక చర్చ జరపాలంటూ టీడీపీ వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు నిరసనకు దిగారు. జంగారెడ్డిగూడెం మరణాలపై చర్చ చేపట్టాలంటూ తెలుగు దేశం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
అంతకు ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలపై ప్రభుత్వ వైఖరికి నిరసనగా సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. మద్యపాన నిషేధంపై ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రంలో కల్తీసారా తాగి ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని, ప్రభుత్వం దీనిపై స్పందించాలని వారు ఆందోళన చేశారు. నిన్న అసెంబ్లీలో ఇదే అంశంపై టీడీపీ సభ్యులు నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో.. టీడీఎల్పీ ఉపనేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మల రామానాయుడు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిలను స్పీకర్ సస్పెండ్ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ