ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటుకు ముహూర్తం ఖరారయింది. ప్రస్తుతమున్న 13 జిల్లాలను పునర్వ్యవస్థీకరించి మొత్తం 26 జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. ఏప్రిల్ 4, సోమవారం ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల మధ్య ఏపీలో కొత్త జిల్లాల అవతరణ జరగనుంది. ఈ మేరకు ఏపీ కేబినెట్ బుధవారం వర్చువల్ గా సమావేశమై ఆమోదం తెలిపింది. కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 4న సీఎం వైఎస్ జగన్ చేతుల మీదుగా జరగనుంది. ఇకపై ఏపీలో శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్ విజయవాడ, గుంటూరు, పల్నాడు, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, శ్రీబాలాజీ, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాలు ఉండనున్నాయి. ఇక నేడు లేదా రేపు జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ వెలువడనుంది.
అలాగే ప్రజలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు కొత్తగా పలాస, భీమిలి, బొబ్బిలి, చీపురుపల్లి, భీమవరం, ఉయ్యూరు, కొత్తపేట, నందిగామ, తిరువూరు, చీరాల, సత్తెనపల్లి, బాపట్ల, ఆత్మకూరు, డోన్, ధర్మవరం, పుట్టపర్తి, రాయచోటి, గుంతకల్, పలమనేరు, శ్రీకాళహస్తి, కుప్పం వంటి రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ముందుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం ఉదయం కొత్త జిల్లాలు ఏర్పాటుపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కొత్త జిల్లాల కేంద్రాలు, పేర్లు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, జిల్లాల ఏర్పాటుపై ప్రజల నుంచి వచ్చిన సలహాలు, సూచనల, ఫిర్యాదులుపై సీఎం వైఎస్ జగన్ అధికారులతో చర్చించారు. జిల్లా కేంద్రాల్లో చేయాల్సిన ఏర్పాట్లు, ఉద్యోగుల కేటాయింపుపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలుస్తుంది. మరోవైపు రాష్ట్రంలోని వాలంటీర్ల సేవలకు గుర్తింపుగా ఏప్రిల్ 6వ తేదీన సత్కార కార్యక్రమం, అలాగే ఏప్రిల్ 8వ తేదీన వసతి దీవెన కార్యక్రమాన్ని నిర్వహించాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ