రేషన్ కార్డుల ఈ-కేవైసీ నమోదు గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద కూడా చేయించుకోవచ్చని, అందరూ ఆధార్ కేంద్రాలకు క్యూ కట్టాల్సిన అవసరం లేదని ఏపీ రాష్ట్ర సివిల్ సప్లైస్ కమీషనర్ కోన శశిధర్ తెలిపారు. రాష్ట్రంలో ఉన్న అన్ని గ్రామ/వార్డు సచివాలయాలనూ ఆధార్ నమోదు కేంద్రాలుగా గుర్తించాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. జాతీయ ఆహార భద్రత చట్టం మేరకు రేషన్ కార్డు ద్వారా కార్డుదారులు దేశంలో ఎక్కడైనా నిత్యావసర సరుకులను తీసుకునే హక్కు పొందడం కోసం బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవడం తప్పనిసరని అని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్ర సివిల్ సప్లైస్ కమీషనర్ కోన శశిధర్ గురువారం నాడు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ-కేవైసీ కోసం బియ్యం కార్డుదారులు ఆధార్ కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన అవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రతి గ్రామ/వార్డు వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం ద్వారా కానీ లేదా రేషన్ షాప్ డీలర్ వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రం ద్వారా ఫ్యూజన్ ఫింగర్ సదుపాయాన్ని వినియోగించుకుని కానీ బియ్యం కార్డు దారులు తమ నివాస ప్రాంతాల్లోనే సులభంగా ఈ-కేవైసీ చేయించుకోవచ్చని తెలిపారు.
వాలంటీర్ వద్ద ఉన్న బయోమెట్రిక్ యంత్రం వద్ద కానీ లేదా చౌక ధరల దుకాణం వద్ద ఉన్న ఈ-పోస్ యంత్రం వద్ద కానీ ఈ-కేవైసీ ఫెయిల్ అయిన వారు మరియు ఇదివరకు బయోమెట్రిక్ రికార్డు కాని వారు మాత్రమే ఆధార్ నమోదు కేంద్రాల వద్దకు వెళ్లి ఈ-కేవైసీ చేయించుకోవాలని చెప్పారు. ఈ-కేవైసీ ఎవరికి అవసరమనగా, బియ్యం కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ-కేవైసీ చేయించుకోవాలన్నారు. అయితే 0-5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకు ఈ-కేవైసీ అవసరం లేదని, 5 నుండి 15 సంవత్సరాల వయసు ఉన్న వారికి వచ్చే నెల సెప్టెంబర్ ఆఖరు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలని చెప్పారు. మిగిలిన వయసు వారు ఈనెల ఆఖరు లోపు ఈ-కేవైసీ చేయించుకోవాలని, పరిస్థితిని బట్టి గడువు పొడిగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. బియ్యం కార్డుల రద్దుపై అనుమానాలు, అపోహలు వద్దని, ఈ-కేవైసీ ప్రక్రియ బియ్యం కార్డులను తొలగించే ప్రక్రియ కాదని, ఇది కేవలం ఆధార్ ద్వారా వ్యక్తిగత ధ్రువీకరణ మాత్రమేనని కోన శశిధర్ ప్రకటనలో తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ