పార్లమెంట్ శీతాకాల సమావేశాలు నవంబర్ 18, సోమవారం నుండి ప్రారంభమయ్యాయి. సెలవులను మినహాయించి 20 రోజులపాటు సాగే ఈ సమావేశాలు డిసెంబర్ 13న ముగుస్తాయి. శీతాకాల సమావేశాలు మొదలైన రెండోరోజునే లోక్ సభలో గందరగోళం నెలకుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవలే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ , ప్రియాంకవాద్రాలకు ఎస్పీజీ భద్రతను ఉపసంహరించిన సంగతి తెలిసిందే. లోక్ సభలో కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశాన్ని లేవనెత్తుతూ ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ చెందిన 20 మంది సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి నిరసన చేపట్టారు. స్పీకర్ ఓం బిర్లా, ఎంపీలను తమ సీట్లకు తిరిగి వెళ్లమని పదేపదే కోరినప్పటికీ వినకపోడంతో, వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ రేపటి నుంచి ఎవరైనా సభ్యులు వెల్లోకి వచ్చి ఆందోళన చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కాంగ్రెస్ లోక్సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌధురీ మాట్లాడుతూ, వారి ఆందోళనలకు ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. గాంధీ కుటుంబ సభ్యులకు ఎస్పీజీ భద్రతను ఎందుకు ఉపసంహరించారని, రేపు వారికీ ఏదైనా ప్రమాదం జరిగితే బీజేపీ జవాబుదారీగా ఉండాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సభ్యులు అలాగే నినాదాలు కొనసాగిస్తుండడంతో హోంమంత్రి అమిత్ షా సభ నుంచి వెళ్లిపోయారు. అనంతరం నిరసనగా కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. విపక్షాల ఆందోళనతో మధ్యాహ్నం 3 గంటలవరకు స్పీకర్ సభను వాయిదా వేశారు. సభ తిరిగి ప్రారంభమైన తరువాత జమ్మూ కశ్మీర్ లో నాయకుల నిర్బంధం, ఢిల్లీలో గాలి కాలుష్యంపై చర్చిస్తున్నారు.
[subscribe]