ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి దృష్ట్యా మే 5 వ తేదీనుంచి కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ (సెక్షన్ 144) అమలు చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూను మే నెలాఖరు (మే 31)వరకు పొడిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిర్ణయించారు. కర్ఫ్యూ అమలులో భాగంగా ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే దుకాణాలకు అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత కేవలం అత్యవసర సేవలనే అనుమతిస్తున్నారు.
రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం వైఎస్ జగన్ సోమవారం నాడు ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సందర్భంగా కర్ఫ్యూ పొడిగింపు సహా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో విధించిన కర్ఫ్యూ కనీసం 4 వారాలు అమల్లో ఉంటేనే కరోనా కట్టడిపై సరైన ఫలితాలు వచ్చే అవకాశముందని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా కట్టడిపై ప్రత్యేక చర్యలను తీసుకోవాలని అధికారులకు సూచించారు. రాష్ట్రంలో కరోనా వలన తల్లిదండ్రులును కోల్పోయిన పిల్లలను ఆదుకునేందుకు తగిన చర్యలు తీసుకోవాలని, అందుకు సంబంధించిన కార్యాచరణ రూపొంచాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అలాగే బ్లాక్ ఫంగస్ వ్యాధిని కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకురావాలని సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ