దేశం మొత్తం గర్వపడేలా ఏపీలో గ్రామ వలంటీర్ వ్యవస్థ నిలిచిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గురువారం పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిర్వహించిన వలంటీర్లకు వందనం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలంటీర్లను ఉద్దేశించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. కొత్తగా ఏర్పాటైన పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట నుంచి వలంటీర్ వ్యవస్థలో భాగమైన వలంటీర్స్ అందరికీ సెల్యూట్ చేస్తున్నామని చెప్పారు సీఎం వైఎస్ జగన్. ఆంధ్రప్రదేశ్లో లంచాలు లేని వ్యవస్థను తీసుకురావాలని కలలు కన్నమని, దానిలో భాగంగానే ఈ వలంటీర్ వ్యవస్థ పురుడు పోసుకుందని వెల్లడించారు. మన వలంటీర్ వ్యవస్థ దేశంలోనే గొప్ప వ్యవస్థగా రూపుదిద్దుకుందని సీఎం జగన్ పేర్కొన్నారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. వలంటీర్ వ్యవస్థ ద్వారా దాదాపు 33 రకాల సేవలను ప్రతీ ఇంటికి అందిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల 60 వేలమంది వలంటీర్లు అహర్నిశలు శ్రమిస్తూ కొన్ని లక్షల మందికి సేవలు అందిస్తున్నారని చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం వివక్షకు తావు లేకుండా అర్హులకు చేరుతుందంటే దానికి కారణం వలంటీర్లే అని ప్రశంసించారు. లంచం, అవినీతిలకు తావులేకుండా, కుల, మత రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలందరికీ సంక్షేమ ఫలాలు అందించటమే మా ప్రభుత్వ లక్ష్యమని, ఆ లక్ష్యం కోసం పాటుపడే సైనికులే వలంటీర్స్ అని పేర్కొన్నారు. వలంటీర్లు అంటే గొప్ప సైనికులని, గొప్ప సేవకులని వ్యాఖ్యానించారు. వారి ఈ సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం తరపున ఒక చిన్న సత్కారం అందజేస్తున్నామని సీఎం జగన్ చెప్పారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ