ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆగస్టు 12, బుధవారం నాడు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో “వైఎస్ఆర్ చేయూత” పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన 45–60 ఏళ్లలోపు అర్హత గల మహిళలకు ఏడాదికి రూ.18,750 చొప్పున నాలుగు సంవత్సరాల్లో మొత్తంగా రూ.75 వేలు అందజేయనున్నారు. అందులో భాగంగా మొదటి విడత సాయంగా దాదాపు 25 లక్షల మంది మహిళ లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ రోజు నేరుగా రూ.18,750 జమచేసే పక్రియను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. వైఎస్ఆర్ చేయూత పథకం కోసం బడ్జెట్లో రూ.4,700 కోట్లు కేటాయించారు, నాలుగేళ్లలో మొత్తం రూ.17 వేల కోట్లను లబ్ధిదారులకు అందించనున్నారు.
ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ, ఈ పథకాన్ని ప్రారంభించడం తన అదృష్టమని, చేయూత ద్వారా లబ్ధిదారుల కుటుంబాలకు మంచి జరగాలని అన్నారు. బ్యాంకులు పాత రుణానికి జమ చేసుకోకుండా ఆదేశాలు ఇచ్చి, అన్ఇన్కంబర్డ్ బ్యాంకు ఖాతాల్లోకి నగదు పంపుతున్నామని చెప్పారు. వ్యాపార అవకాశాలను మహిళల వద్దకే చేర్చాలన్నది ఈ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. మహిళా సాధికారిత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అమూల్, ఐటీసీ,హెచ్యూఎల్, పీ అండ్ జీ, జియోమార్ట్ లాంటి దిగ్గజ కంపెనీలతో ఒప్పందం చేసుకుందని చెప్పారు. లబ్ధిదారులకు నగదుతో పాటుగా రెండు పేజీల లేఖ కూడా పంపుతున్నామని, వ్యాపార అవకాశాలను ఉపయోగించుకోవాలనుకుంటే ఒప్పంద సంస్థలతో నేరుగా సంప్రదించవచ్చని చెప్పారు. అయితే ఎలాంటి ఆంక్షలు లేవని, పూర్తి స్వేచ్ఛతో డబ్బును ఎలా వాడుకోవాలన్నది మహిళా లబ్ధిదారుల ఇష్టమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu