ఆగస్టు 12, బుధవారం నాడు ప్రగతి భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. రాష్ట్రంలో నిర్వహించాల్సిన ప్రవేశ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్ఎస్యూఐ విద్యార్థి నాయకులు ప్రగతి భవన్ ముట్టడికి యత్నించారు. హైకోర్టులో పరీక్షల నిర్వహణపై పిటిషన్ పెండింగ్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసి, పరీక్షలు ఎలా నిర్వహిస్తారని విద్యార్థి నాయకులు నినాదాలు చేశారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థులు కరోనా బారిన పడే అవకాశం ఉందని ఎన్ఎస్యూఐ రాష్ట్ర నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ముందుగా పీపీఈ కిట్లు ధరించిన ఎన్ఎస్యూఐ నాయకులు పెద్ద సంఖ్యలో ప్రగతిభవన్ కు చేరుకొని, లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకుంది. అనంతరం అరెస్ట్ చేసిన ఆందోళనకారులను పోలీసులు గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా తెలుస్తుంది.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu