విజయవాడ బెంజ్ సర్కిల్ సమీపంలోని వేదిక కల్యాణ మండపంలో అమరావతి పరిరక్షణ సమితి సమావేశం ప్రారంభమైంది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణ, టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా, కనకమేడల రవీంద్ర, కాంగ్రెస్, జనసేన, సీపీఎం, బీజేపీ, ప్రజా సంఘాల నేతలు, ఇతరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం జరుగుతున్న ప్రదేశం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఈ సమావేశంలో జేఏసీ కన్వీనర్ శివారెడ్డి, పలు పార్టీల నేతలు మాట్లాడుతూ, రాజధాని తరలింపు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశమనంతరం అమరావతి జేఏసీ మచిలీపట్నంలో తలపెట్టిన చైతన్యయాత్రలో పాల్గొనేందుకు చంద్రబాబు సహా నేతలంతా వెళ్లనున్నారు.
జనవరి 8, బుధవారం నాడు అమరావతి పరిరక్షణ సమితి కేంద్ర కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. కార్యాలయం ప్రారంభోత్సవం తర్వాత చంద్రబాబు, సీపీఐ నేత రామకృష్ణతో పాటు పలువురు జేఏసీ నేతలు బస్సు యాత్రను ప్రారంభించేందుకు పాదయాత్రగా వెళ్తుండగా పోలీసులు వారిని అడుక్కున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై బైఠాయించిన చంద్రబాబుతో సహా ఇతర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆసమయంలో చంద్రబాబుకు మద్దతుగా టీడీపీ కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో చంద్రబాబుతో పాటుగా నారా లోకేశ్, అచ్చెన్నాయుడు, దేవినేని ఉమ, నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అశోక్బాబులను పోలీసు వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. అనంతరం వారిని ఉండల్లిలోని చంద్రబాబు నివాసం వద్ద విడిచిపెట్టారు. నేతలను అదుపులోకి తీసుకుని, అమరావతిపరిరక్షణ సమితి బస్సుయాత్రను పోలీసులు అడ్డుకోవడాన్ని పలు పార్టీల నేతలు ఖండించారు.
[subscribe]