ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏప్రిల్ 13, సోమవారం ఉదయానికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 432కు చేరినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ఏపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది. అందులో భాగంగా ‘వైఎస్ఆర్ టెలీమెడిసిన్’ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి “టెలీమెడిసిన్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం టెలీమెడిసిన్ టోల్ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వైద్యుడితో మాట్లాడారు. టెలీమెడిసిన్ విధానాన్ని ప్రతిరోజూ పర్యవేక్షిస్తూ అవసరమైతే వైద్యుల సంఖ్య పెంచాలని సీఎం సూచించారు.
టెలి మెడిసిన్ అమలు కోసం టోల్ ఫ్రీ నెంబరు 14410 ను కేటాయించారు. ఈ టెలీమెడిసిన్ విధానంలో స్వచ్ఛందంగా సేవలందించేందుకు ఇప్పటికే 286 మంది వైద్యులు, 114 మంది ఎగ్జిక్యూటివ్స్ ముందుకు వచ్చారు. వీరంతా ప్రతి రోజూ ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మూడు షిఫ్టుల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించనున్నారు. రోగులు ఈ నెంబర్ కు మిస్డ్ కాల్ ఇస్తే ముందుగా ఎగ్జిక్యూటివ్స్, ఆ తర్వాత వైద్యులు వారిని సంప్రదిస్తారు, అనంతరం వారి లక్షణాల బట్టి రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu