ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) పలు దేశాలను వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికీ కరోనా వ్యాప్తి చెందిన అన్ని దేశాల్లో కలిపి 1.8 మిలియన్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా, 113,000 మందికి పైగా మరణించారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) స్పందిస్తూ, ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ముప్పునుంచి ఈ మానవాళి ఇప్పట్లో బయటపడే అవకాశాలు లేవని అభిప్రాయపడింది. ఈ కరోనా వైరస్ కు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకూ ఈ ముప్పు పొంచివుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికార ప్రతినిధి డా.డేవిడ్ నాబర్రో పేర్కొన్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంతవరకూ ఈ వైరస్ ద్వారా ప్రజలు ఇబ్బందిపడే పరిస్థితులే కన్పిస్తున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
కరోనా వైరస్ ప్రభావం కొంతకాలం తర్వాత తగ్గినట్లు కనిపించినప్పటికీ, మళ్లీ తిరిగి విజృంభించే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ లక్షణాలున్న వారిని వెంటనే గుర్తించి, ఐసొలేషన్ లో ఉంచే పద్దతిని కొనసాగిస్తూనే ఉండాలని ప్రపంచ దేశాలకు ఆయన సూచించారు. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కరోనా వ్యాప్తి చెందిన దేశాలన్నీ సిద్ధంగా ఉండాలని చెప్పారు. ప్రస్తుతం పలు దేశాల్లో ఇంటికే పరిమితం కావాలని విధించిన ఆంక్షలను ఎత్తివేస్తామని ఆయా దేశాలు చేస్తున్న ప్రకటనలపై మరోసారి పునరాలోచించుకోవాలని కోరారు. డబ్ల్యూహెచ్ఓకు నిధులు నిలిపివేస్తామన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ అమెరికాతో తమ భాగస్వామ్యం కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ ట్రంప్ చెప్పిందే జరిగితే చాలా దురదృష్టకరంగా భావించాల్సి ఉంటుందని డేవిడ్ నాబర్రో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu