ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవంబర్ 18, సోమవారం నాడు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ రోజు ఉదయం తన సతిమణి భారతితో కలిసి అమరావతిలోని రాజ్భవన్కు వెళ్లిన సీఎం జగన్ దాదాపు గంటన్నరసేపు గవర్నర్ తో సమావేశం అయ్యారు. ముందుగా సీఎం జగన్ దంపతులకు గవర్నర్ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా మరియు ఇతర అధికారులు స్వాగతం పలికారు. ఈ భేటీలో రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులు, రాజకీయ పరిణామాలు, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాలపై కీలకంగా చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా డిసెంబర్ మొదటివారంలో జరపాలని నిర్ణయించిన అసెంబ్లీ సమావేశాలలో ఆమోదించాల్సిన వివిధ బిల్లులపై సీఎం జగన్ చర్చించినట్టుగా తెలుస్తుంది. రాజ్భవన్లో జగన్ దంపతులకు గవర్నర్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విందు స్వీకరించిన అనంతరం వారు క్యాంప్ కార్యాలయానికి బయలుదేరి వెళ్లారు.
మరోవైపు రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా, అక్రమ నిల్వ మరియు అధిక ధరల విక్రయాన్ని నిరోధించడానికి సీఎం వైఎస్ జగన్ 14500 అనే టోల్ ఫ్రీ నంబరును సోమవారం నాడు ప్రారంభించారు. ఇసుక రవాణాలో అవినీతిపై ప్రజలు ఫిర్యాదు చేసేందుకు ఈ టోల్ ఫ్రీ నంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. అనంతరం 14500 టోల్ ఫ్రీ నంబరుకు కాల్ చేసి అక్కడి అధికారులతో మాట్లాడారు. ఫిర్యాదులు స్వీకరించే కాల్ సెంటర్ ఉద్యోగులకు సీఎం జగన్ ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. టోల్ ఫ్రీ నంబర్ ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, టాస్క్ఫోర్స్ చీఫ్ సురేంద్ర బాబు, ఇతర అధికారులు హాజరయ్యారు. రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే రెండు లక్షల జరిమానాతో పాటు రెండేళ్లు పాటు జైలు శిక్ష విధించేలా ఇటీవలే మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.
[subscribe]