తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి లడ్డు ప్రసాదం ధర పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో లడ్డు ధర పెంచారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. ఈ మేరకు ఆదివారం నాడు ఆయన ట్విట్టర్లో స్పందిస్తూ, తిరుమల లడ్డూ ధర పెంచే ఆలోచన కానీ, అలాంటి ప్రతిపాదనను గాని టీటీడీలో చర్చించడం లేదని చెప్పారు. అలాగే తిరుమలలో సామాన్య భక్తులు తీసుకునే అద్దె గదుల ధరలు పెంచలేదని స్పష్టం చేశారు. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను ఇబ్బందిపెట్టే విధంగా పాలకమండలి ఎలాంటి నిర్ణయం తీసుకోదని తెలిపారు. మరో వైపు నవంబర్ 17, ఆదివారం నాడు చెన్నై లోని టీనగర్లో టీటీడీ ఆలయానికి కొత్తగా నియమించబడ్డ స్థానిక సలహామండలి ఉపాధ్యక్షులు, సభ్యుల చేత టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి పదవీ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, చెన్నైలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయ నిర్మాణం కోసం భూమి కేటాయించాలని ఇప్పటికే తమిళనాడు సీఎంతో చర్చించినట్టు తెలిపారు. అదే విధంగా ప్రస్తుతం ఉన్న ఆలయానికి మెరుగులు దిద్దుతామని చెప్పారు. నవంబర్ 23 నుంచి తిరుచానూరులో పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, అదే రోజున చెన్నైలో కూడ ప్రారంభిస్తామని చెప్పారు.
[subscribe]