ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫిబ్రవరి 24, బుధవారం నాడు మనబడి నాడు-నేడు కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021-22 విద్యా సంవత్సరం నుంచి పాఠశాల విద్యలో సీబీఎస్ఈ విధానం అమలు చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ముందుగా 2021-22 నుంచి 1 నుంచి 7వ తరగతి వరకు సీబీఎస్ఈ సిలబస్ అమలోకి తేవాలని, అనంతరం ఒక్కో ఏడాది ఒక్కో తరగతికి చొప్పున 8,9, 10 తరగతులకు కూడా ప్రవేశపెట్టాలన్నారు. 2024-25 విద్యా సంవత్సరానికల్లా ఒకటి నుంచి పదో తరగతి వరకు సీబీఎస్ఈసీ విధానం అమల్లోకి రావాలని, అందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
ఇక విద్యాకానుకలో అందించే వస్తువులతో పాటుగా ఈసారి ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీని చేర్చాలని సూచించారు. పాఠ్యపుస్తకాల నాణ్యత ప్రైవేట్ పాఠశాలలతో పోటీగా ఉండాలని చెప్పారు. అమ్మ ఒడి కింద ల్యాప్ టాప్ ఆప్షన్ ఎంచుకునే విద్యార్ధులకు అందించే ల్యాప్ టాప్ల క్వాలిటీ, సర్వీస్ బాగుండాలని సూచించారు. తొలి విడత నాడు-నేడు పనులను మార్చి నెల చివరికల్లా పూర్తిచేయడం, రెండో దశ నాడు-నేడు పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రాష్ట్రంలో పక్కా భవనాలు లేని 390 పాఠశాలకు భవనాల నిర్మాణాలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ