జూలై 21 నాడు ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ బుల్లితెర తెలుగు ప్రేక్షకులను సరికొత్త మలుపులతో విశేషంగా అలరిస్తుంది. సెప్టెంబర్ 29, ఆదివారం నాడు జరిగిన 71వ ఎపిసోడ్ లో ప్రముఖ టీవీ నటుడు రవికృష్ణ ఈ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఈ వారం ఎలిమినేషన్ ప్రాసెస్ లో వరుణ్ సందేశ్, శ్రీముఖి, బాబా భాస్కర్, రవికృష్ణ ఉండగా శనివారం ఎపిసోడ్ లోనే వరుణ్ సందేశ్ సేఫ్ జోన్ లో ఉన్నట్టు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇక మిగిలిన ముగ్గురిలో ప్రేక్షకుల నుంచి తక్కువ ఓట్లు పొందిన రవికృష్ణ ఎలిమినేట్ అయినట్టు ఆదివారం నాడు నాగార్జున ప్రకటించారు.
బిగ్ బాస్ షో నుంచి ఎలిమినేట్ అయితే డైరెక్టుగా విజయవాడ వెళ్లి తన అమ్మానాన్నను కలుస్తానని చెప్పిన రవికృష్ణకు, హోస్ట్ నాగార్జున ముందుగానే ఫ్లైట్ టికెట్ సిద్ధం చేసుకుని వచ్చారు. ఆ ఫ్లైట్ టికెట్ చూపించే రవి ఎలిమినేట్ అయినట్టుగా ప్రకటించారు. రవి షో నుంచి బయటకు వెళ్తుండడంతో శివజ్యోతి, అలీరేజా కన్నీరు పెట్టుకున్నారు. బిగ్ బాస్ ఇచ్చిన బిగ్ బాంబును రవి, పునర్నవికి కేటాయించాడు. మళ్ళీ బిగ్ బాస్ చెప్పేంతవరకు ఇంటి సభ్యుల బట్టలన్నీ ఉతకాలని బిగ్ బాస్ పునర్నవిని ఆదేశించారు. 100 రోజుల పాటు ఆసక్తికరంగా సాగే ఈ షో లో ఇప్పటికి 71 రోజులు పూర్తయ్యాయి. నటి హేమ, జర్నలిస్టు జాఫర్, వైల్డ్ కార్డు ఎంట్రీ తమన్నా సింహాద్రి, రోహిణి, అషురెడ్డి, శిల్ఫా చక్రవర్తి, హిమజ , రవికృష్ణ ఎలిమినేట్ అవ్వడంతో ఇంటిలో ఇంకా 9 మంది సభ్యులున్నారు. టీవీ నటుడు అలీరేజా ఒకసారి ఎలిమినేట్ అయ్యి మళ్ళీ వైల్డ్ కార్డు ఎంట్రీగా ఇంటిలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.