ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ‘జగనన్న చేదోడు’ పథకం కింద నగదు విడుదల కార్యక్రమం నేడు ప్రారంభమైంది. ఈ పథకం ద్వారా వరుసగా రెండో ఏడాది రజక, నాయీబ్రాహ్మణ, దర్జీల సంక్షేమం కోసం నిధులు విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా.. సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని అన్నారు. జగనన్న చేదోడు కింద 2.85 లక్షల మందికి సాయం చేస్తున్నామని చెప్పారు. అలాగే, లంచాలకు, వివక్షకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లో అర్హుల జాబితానుంచి లబ్ధిదారులను ఎంపికచేస్తున్నట్లు సీఎం జగన్ పేర్కొన్నారు. పాత అప్పులకు జమచేసుకునే వీలు లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని సీఎం అన్నారు.
కాగా, మంగళవారం విడుదల చేస్తున్న రూ.285.35 కోట్లతో కలిపి ఇప్పటివరకు ఈ పథకం కింద ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ.583.78 కోట్లుగా సీఎం జగన్ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ‘జగనన్న చేదోడు’ పథకం కింద షాపులున్న రజకులు, నాయీబ్రాహ్మణులు, దర్జీలకు ప్రతి సంవత్సరం రూ. 10 వేల వరకు ఆర్థిక సాయం అందిస్తున్నామని సీఎం ఈ సందర్భంగా గుర్తుచేశారు. అలాగే, వైసీపీ ప్రభుత్వం వచ్చాక లక్షా 20 వేల శాశ్వత ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 92 శాతం కార్పొరేషన్ ఛైర్మన్ పదవులిచ్చామని చెప్పారు. మున్సిపల్ ఛైర్మన్ పదవులను 73 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకే ఇచ్చామని తెలిపారు. ఇంకా, 58 శాతం నామినేటెడ్ పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వార్గాలకే ఇచ్చామని సీఎం జగన్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ