తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం నాడు నిర్వహించిన మీడియా సమావేశంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్టను దెబ్బతీస్తుందని విమర్శించారు. పీపీఏల అంశంలో టీడీపీ ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభాసుపాలయ్యారని చెప్పారు. పీపీఏలపై ప్రధాని నరేంద్రమోడీకి జగన్ రాసిన లేఖలో అన్ని అవాస్తవాలే ఉన్నాయని ఆరోపించారు. ఈ విషయంలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి, నిపుణులు, హైకోర్టు ఎవరు చెప్పినా వినకుండా జగన్ ప్రవర్తిస్తున్నారని అన్నారు. మీడియా సమావేశం ఏర్పాటుచేసి తప్పుడు సమాచారం ఇచ్చే అధికారం, ప్రభుత్వ అధికారులకు ఎవరిచ్చారని, ముఖ్యమంత్రి ఒత్తిడి చేస్తే తప్పులు చేస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం చేసే తప్పులకు అధికారులు బలికావొద్దని చంద్రబాబు సూచించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్వార్ధం కోసం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, రివర్స్ టెండరింగ్ పేరుతో రాష్ట్రానికి రూ.7,500 కోట్ల నష్టం వాటిల్లిందని చంద్రబాబు అన్నారు. ఇసుక విధానంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవరించిన తీరువలన 20 లక్షలమంది భవన నిర్మాణ కార్మికులు రోడ్డున పడ్డారని విమర్శించారు. కేవలం నాలుగు నెలల్లోనే ప్రజలకు నరకం చూపిస్తున్నారంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలలో జరిగిన అవకతవకలపై ప్రభుత్వం పట్టించుకోవట్లేదని అన్నారు. ఈ ఉద్యోగాలకు మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేసారు, ఇష్టానుసారంగా వ్యవహరిస్తే భవిష్యత్ లో తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని ఆయన హెచ్చరించారు.
[subscribe]