ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అక్టోబర్ 21 సోమవారం నాడు ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. సోమవారం ఉదయం విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ సభలో పాల్గొన్న అనంతరం ఆయన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంట సమయంలో ఢిల్లీ చేరుకోనున్నారు, రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఢిల్లీలో పర్యటించనున్నారు. అక్కడ రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలు, మరియు సమస్యలపై ముందుగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్షాతో చర్చించనున్నారు. అదేవిధంగా గజేంద్రసింగ్ షెకావత్, ధర్మేంధ్ర ప్రధాన్, ఆర్కే సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులను కలుసుకుని వివిధ అంశాలపై చర్చించే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా రాష్ట్రానికి సంబంధించిన కీలక సమస్యలు, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పిపిఎలు), పోలవరం రివర్స్ టెండరింగ్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం మరియు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, ఇతర ముఖ్యమైన అంశాలు చర్చకు రానున్నాయి. సోమవారం రాత్రికి ముఖ్యమంత్రి ఢిల్లీలోనే బసచేస్తారు. అక్టోబర్ 22 మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఢిల్లీ నుంచి బయలుదేరి నేరుగా విశాఖపట్నం చేరుకుంటారు. అక్కడ అరకు వైసీపీ ఎంపీ గొడ్డేటి మాధవి వివాహ రిసెప్షన్కు హాజరు కానున్నారు. అనంతరం అదేరోజు రాత్రి బయలుదేరి తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు.
[subscribe]